నాగచైతన్య రొమాంటిక్గా.. సిగ్గుతో శోభితా ధూళిపాల.. ఏం జరిగిందంటే?
మీడియాలో వచ్చిన ఊహాగానాలను నిజం చేస్తూ అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల గతేడాది నిశ్చితార్ధం చేసుకుని అందరినీ షాక్కు గురిచేశారు. వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని గతంలోనే మీడియా కోడై కూసినా.. చాలా మంది గాలివార్తలుగానే కొట్టేశారు. కొందరు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్న మాటలు మాట్లాడారు. కట్ చేస్తే ఓ మంచి ముహూర్తం చూసుకుని శోభిత వేలికి ఉంగరం తొడిగేశారు చైతన్య.
చివరికి నాగార్జున అఫిషీయల్గా ఈ ఎంగేజ్మెంట్ నిజమేనని కన్ఫర్మ్ చేయడం, చైతూ- శోభితల నిశ్చితార్ధం ఫోటోలు బయటకు రావడంతో సినీ వర్గాలు, అక్కినేని అభిమానులు షాకయ్యారు. నాగచైతన్య ఓ ఇంటివాడు కావడంతో అక్కినేని ఫ్యాన్స్ సంబరాలకు అంతు లేకుండా పోయింది. సమంతతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న చైతన్య మరో పెళ్లి చేసుకుని ఆయన సంతోషంగా ఉండాలని వారు కోరుకున్నారు.

నిశ్చితార్ధం తర్వాత చైతూ- శోభితల పెళ్లెప్పుడు? ఇండియాలోనా? ఫారిన్లోనా? డెస్టినేషన్ వెడ్డింగా? లేక సింపుల్గా తేల్చేస్తారా అంటూ రకరకాల కథనాలు వచ్చాయి. అయితే అన్ని పుకార్లను పటాపంచలు చేస్తూ అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్లోనే వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సినీ , రాజకీయ, క్రీడా, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు వీరి వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
కొత్తగా పెళ్లయినప్పటికీ నాగచైతన్య - శోభితలు ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా తమ కెరీర్పై ఫోకస్ పెట్టారు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటించిన తండేల్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో ఆయన విరామం లేకుండా పాల్గొన్నారు. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్తో పాల్గొన్నారు. ఫిబ్రవరి 7న రిలీజైన ఈ సినిమా తొలి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. సాయిపల్లవి - నాగచైతన్యల జోడీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ను కొట్టేసిన తండేల్.. 100 కోట్ల క్లబ్లో చేరినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

చాలా రోజుల తర్వాత అక్కినేని అభిమానులకు పండగ చేసుకోవడంతో నాగచైతన్య తండ్రి , టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్లో తండేల్ బ్లాక్ బస్టర్ లవ్ సునామీ పేరుతో స్పెషల్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి కింగ్ అక్కినేని నాగార్జున చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. అలాగే పెళ్లి తర్వాత తొలిసారిగా తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి హాజరయ్యారు చైతూ.
సక్సెస్మీట్కు వచ్చి చాలా రోజులు అవుతోందని.. చైతూకి హిట్ ఇచ్చినందుకు చందూ మొండేటీ , అల్లు అరవింద్, బన్నీ వాస్లకు నాగార్జున థ్యాంక్స్ చెప్పారు. కోడలు శోభిత వచ్చిన వేళా విశేషం బాగుందని .. సినిమా సూపర్హిట్ అయ్యిందని చెప్పడంతో శోభిత సిగ్గుపడ్డారు. అలాగే స్టేజ్ మీద నుంచి యాంకర్ మంజూష.. చైతన్య - శోభితలను ఆటపట్టించింది. తండేల్ సినిమాలోని ఓ డైలాగ్ను చెప్పాలని అడగ్గా.. శోభిత సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వింది. బుజ్జితల్లి పక్కనే ఉన్నాకదే అని చెప్పడంతో ఆడిటోరియం అరుపులు కేకలతో దద్ధరిల్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











