కరోనా ఎఫెక్ట్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు నాగార్జున విన్నపం
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో దేశ జనాభా ఆందోళన చెందుతున్నారు. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ప్రజలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అటు ప్రభుత్వాలు, ఇటు సెలబ్రిటీలు పెద్దఎత్తున స్పందిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటించడం ఒక్కటే దీనికి సరైన మార్గమని చెబుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, రాజమౌళి లాంటి ఎందరో సినీ తారలు ఈ అంశంపై స్పందించగా, తాజాగా నాగార్జునతో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ సందేశం ఇప్పించింది. 'మీరు క్షేమంగా ఉండండి.. మీ కుటుంబాన్ని, సమాజాన్ని క్షేమంగా ఉంచండి' అని పిలుపునిస్తూ వీడియో రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో నాగార్జున మాట్లాడుతూ.. ''ప్రియమైన తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా విన్నపం. మీరెవ్వరూ ఇళ్లు వదిలి బయటకు రావొద్దు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రండి. ఈ దృఢ సంకల్పంతోనే కరోనాను అరికట్టవచ్చు. ముఖ్యంగా 65 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు ఇళ్లు వదిలి బయటకు రాకండి.. సురక్షితంగా ఉండండి.. జాగ్రత్త వహించండి'' అని కోరారు.
అదేవిధంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధానితో పాటు అందరం బయటకు వచ్చి చప్పట్లు కొట్టి.. కరోనా అరికట్టడంలో భాగమవుతామని పేర్కొందామని ట్వీట్ చేశారు నాగార్జున.


Click it and Unblock the Notifications











