గేమ్ ఛేంజర్పై కామెంట్ పొరపాటే.. రాంచరణ్ నా కొడుకు లాంటి వాడు.. అల్లు అరవింద్
మెగా హీరోల మధ్య గతంలో మాదిరిగా సన్నిహిత సంబంధాలు లేవని ఫిల్మ్నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నామధ్య స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మెగా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ రోజు రోజుకు పెరిగిపోతున్నట్లుగా కనిపించింది. చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్, నంద్యాలలో వైసీపీకి ఎన్నికల ప్రచారం తదితర కారణాలు కనిపిస్తున్నా అంతకు మించి ఏదో జరుగుతోందని అంతా అనుకునేలా పరిస్ధితులు ఉన్నాయి. మెగా ఫ్యామిలీతో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉండేవాళ్లు, అభిమానులు ప్రస్తుతం అల్లు అర్జున్ పేరు చెబితే చాలు భగ్గుమంటున్నారు.
అయితే ఇటీవల సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకునన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత చిరంజీవి, నాగబాబులు అల్లు కుటుంబానికి మద్ధతుగా నిలవడంతో ఈ కుటుంబం ఎప్పటికీ ఒక్కటేననే సంకేతాలు ప్రజల్లో బలంగా వెళ్లాయి. విడుదలైన వెంటనే తన మామయ్యలు చిరు, నాగబాబులను కుటుంబంతో సహా వెళ్లి కలిసి భోజనం చేశాడు అల్లు అర్జున్. పరిస్ధితులు చక్కబడుతున్న దశలో మెగా - అల్లు ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టేలా ఓ ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా స్వయంగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కారణంగా.

గీతా ఆర్ట్స్ నిర్మాణంలో అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరయ్యారు అల్లు అరవింద్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరైన దిల్రాజుని పొగిడే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వారం చాలా చేసేశారు దిల్రాజు.. ఓ సినిమాని కిందికి చూసి, ఇంకో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లి చరిత్ర సృష్టించాడని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అల్లు అరవింద్ పరోక్షంగా గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయిన సంగతిని ప్రస్తావించారా అంటూ మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్కు దిగారు. గేమ్ ఛేంజర్ గురించి నేరుగా చెప్పకపోయినా ఆ కిందకి పోయిన సినిమా రామ్ చరణ్దేనని వారు మండిపడుతున్నారు. అటు వీరికి కౌంటర్గా అల్లు ఆర్మీ దిగడంతో మరోసారి రెండు వర్గాలకు సోషల్ మీడియాలో వార్ నడిచింది.

తాజాగా నాడు చేసిన వ్యాఖ్యలపై అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు. నేను చరణ్ స్థాయిని తగ్గించేలా మాట్లాడానని.. కొందరు మెగా అభిమానులు నన్ను ట్రోల్ చేశారని.. కానీ తాను దిల్రాజు పరిస్ధితి గురించి చెప్పే క్రమంలో పొరపాటున అలాంటి మాటలు వచ్చాయని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.
దిల్రాజు ఒకే ఒక్క వారంలోనే ఎన్నో కష్టాలు, నష్టాలు, ఐటీ రైడ్స్ వంటివి అనుభవించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రామ్ చరణ్ నాకున్న ఏకైక మేనల్లుడని, నేను చరణ్కు ఏకైక మేనమామనని.. తను నా కొడుకు లాంటోడని అల్లు అరవింద్ వారి బంధాన్ని గుర్తుచేశారు. ఉద్దేశపూర్వకంగా తాను ఏదీ అనలేదని.. మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని, ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయాలని మెగా అభిమానులను అల్లు అరవింద్ రిక్వెస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











