మెగా, అల్లు ఫ్యామిలీలలో తీవ్ర విషాదం.. పుట్టెడు దు:ఖంలో రాంచరణ్, అల్లు అర్జున్!
మెగా, అల్లు ఫ్యామిలీలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఆగస్ట్ 29వ తేదీ అర్థరాత్రి సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆగస్ట్ 30వ తేదీన మధ్యాహ్నం హైదరాబాద్ కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మరణవార్త తెలుసుకున్న మనవళ్లు రామ్ చరణ్, అల్లు అర్జున్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పెద్ది షూటింగ్ నిమిత్తం చరణ్ మైసూరులో ఉండగా.. అట్లీ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ ముంబైలో ఉన్నారు. కనకరత్నమ్మ మరణం నేపథ్యంలో వీరిద్దరూ షూటింగ్స్ రద్దు చేసుకుని మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకోనున్నారు. మరోవైపు.. జనసేన పార్టీ వైజాగ్లో భారీ బహిరంగ సభ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, నాగబాబులు ఆదివారం వచ్చి అల్లు కుటుంబానికి సంతాపం తెలియజేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు ముగ్గురు సంతానం కాగా.. వారిలో కుమారుడు అల్లు అరవింద్, కుమార్తె సురేఖ తెలుగు ప్రజలకు సుపరిచితమే. అల్లు అరవింద్ పిల్లలు అల్లు అర్జున్, శిరీష్, బాబీ. సురేఖను మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చి వివాహం చేయగా.. వారి పిల్లలు రామ్ చరణ్, సుస్మిత కొణిదెల. అల్లు రామలింగయ్య 2004లో మరణించిన తర్వాత కనకరత్నం మీడియాకు దూరంగా ఉంటున్నారు. గతేడాది అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాల్లో కనిపించారు.
అలాగే అల్లు స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో అల్లు అరవింద్ స్వయంగా తన తల్లిని స్టేజ్ మీదకు తీసుకొచ్చి.. అల్లు అర్జున్ చేతుల మీదుగా సత్కరించిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కనకరత్నం. ఇటీవల పలుమార్లు ఆమె ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నారని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీటిని మెగా, అల్లు కుటుంబాలు ఖండించాయి.
కనకరత్నమ్మ మరణవార్త తెలుసుకున్న ఆమె కూతురు అల్లుడు.. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు అల్లు నివాసానికి చేరుకుని ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. గత కొంతకాలంగా అల్లు అర్జున్కు - మెగా కుటుంబానికి మధ్య దూరం పెరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మెగా క్యాంప్కు దూరంగా సొంత ఇమేజ్తో ముందుకు వెళ్లాలని బన్నీ భావిస్తున్నట్లుగా ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు అల్లు ఫ్యామిలీకి చిరంజీవి అండగా నిలబడ్డారు. బెయిల్పై విడుదలైన వెంటనే చిరంజీవి, నాగబాబుల నివాసానికి బన్నీ సతీసమేతంగా వెళ్లాడు. ఇటీవల మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవికి ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేశారు బన్నీ. అలాగే సాయంత్రం హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన పార్టీకి అల్లు అర్జున్, స్నేహ దంపతులు హాజరై తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని రుజువు చేశారు.


Click it and Unblock the Notifications











