అల్లు - మెగా ఫ్యామిలీలో మరో చిచ్చు ... జగన్ ఫ్లెక్సీలో బన్నీ, ‘శత్రువులు’ అంటూ కొటేషన్
తెలుగు చిత్ర పరిశ్రమను కనుసైగతో శాసించే కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి వేసిన పునాదులపై ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా, నిర్మాతలుగా రాణిస్తున్నారు. ప్రతి ఏటా ఈ ఫ్యామిలీ హీరోల పేరు మీద వందల కోట్ల వ్యాపారం జరుగుతూ తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు సాయం చేస్తున్నారు మెగా హీరోలు. అందుకే ఇండస్ట్రీ మొత్తం ఈ ఫ్యామిలీని గౌరవిస్తుంది, ఆరాధిస్తుంది.
ఇక తొలి నుంచి మెగా హీరోలది , కుటుంబానికి ఒకే మాట. కుటుంబంలో కానీ, సినిమా విషయాలలో కానీ మెగా ఫ్యామిలీ అంతా ఏకతాటిపైకి వచ్చి నిలబడేది . ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు తోడుగా నిలిచేవారు. అయితే ఈ కుటుంబంలో పరిణామాలు గతంలో మాదిరిగా లేవని ఫిలింనగర్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అరవింద్ కుమారుడు , ఐకాన్స్టార్ అల్లు అర్జున్ వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశమైంది. మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరని , తనకు మెగా బ్రాండ్ వద్దన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉంటుందంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుంటారు.

చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్తో పాటు నిన్న మొన్నటి నంద్యాలలో వైసీపీ అభ్యర్ధికి ప్రచారం వరకు బన్నీ వైఖరి మెగా ఫ్యామిలీకి ఆగ్రహం తెప్పించిందని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తుంటాయి. తొలుత కుర్రతనం కాబట్టి చూసీ చూడనట్లుగా వదిలేసినప్పటికీ .. ఏపీ ఎన్నికలు అల్లు - మెగా కుటుంబం మధ్య పెద్ద గ్యాప్ తీసుకొచ్చాయని సినీ వర్గాలు అంటుంటాయి. మేనమామ పవన్ కళ్యాణ్కు ప్రత్యర్ధి అయిన వైసీపీ అభ్యర్ధి శిల్పా రవికి మద్ధతుగా అల్లు అర్జున్ దంపతులు నంద్యాలలో దిగారు. ఈ పరిణామాలతో మెగా పెద్దలు అల్లు అర్జున్ పై సీరియస్ అయినట్లుగా పుకార్లు వైరల్ అయ్యాయి. ఏపీ ఎన్నికలు ముగిసిన వెంటనే అల్లు అర్జున్పై నాగబాబు ట్వీట్, బన్నీ దంపతులను సాయిథరమ్ తేజ్ సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం .. ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి.
అల్లు అర్జున్ కూడా కొన్ని సందర్భాలలో మెగా ఫ్యామిలీపై ఇన్డైరెక్ట్ కామెంట్స్ చేశారంటూ మెగా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా.. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజైంది. ఈ నేపథ్యంలో పుష్ప చిత్ర యూనిట్ మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. అయితే చిరుని కలిసిన బృందంలో హీరో అల్లు అర్జున్ లేకపోవడం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది.
కానీ ఇప్పుడు అల్లు అరవింద్ కుటుంబానికి పెద్ద కష్టం కలిగింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆయన కొద్దిలో జైల్లోకి వెళ్లకుండా బెయిల్పై బయటకొచ్చారు. మేనల్లుడి అరెస్ట్ వార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి , నాగబాబులు అల్లు కుటుంబానికి అండగా నిలిచి న్యాయ పోరాటానికి సాయం చేశారని ఫిలింనగర్ టాక్. దీంతో విడుదలైన వెంటనే చిరు, నాగబాబులను కుటుంబంతో సహా కలిసొచ్చారు బన్నీ. అలా మెగా - అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతున్న దశలో రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే ఘటన చోటు చేసుకుంది.
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో జగన్, అల్లు అర్జున్ ఫోటోలను ఏర్పాటు చేసి రాజు బలవంతుడైనప్పుడే శత్రువులు అంతా ఏకం అవుతారు అంటూ రెచ్చగొట్టేలా కొటేషన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిని టీడీపీ కూటమిని ఉద్దేశించి పెట్టారా లేక మెగా ఫ్యామిలీని ఉద్దేశించి పెట్టారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











