Allu Arjun: అల్లు అర్జున్ ప్రోటోకాల్ వివాదం.. కాంట్రవర్సీపై స్టార్ ప్రొడ్యూసర్ క్లారిటీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) '42 పాయింట్స్ ప్రోటోకాల్' వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ పాడ్కాస్ట్లో బాలీవుడ్ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్తో యాడ్ షూట్ సమయంలో తమకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటూ ఏకంగా 42 నిబంధనలు పెట్టారని ఆమె చెప్పడం సోషల్ మీడియాలో భారీ దుమారం రేపింది. ఈ వివాదంపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే?
బాలీవుడ్ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ వ్యాఖ్యల తర్వాత "ఇదే ఆ 42 షరతుల జాబితా" అంటూ ఓ నోట్ నెట్టింట వైరల్ అయింది. అందులో హ్యాండ్షేక్ చేయకూడదు, కనీసం మూడు అడుగుల దూరం పాటించాలి, స్టైలిష్ స్టార్ కాకుండా ఐకాన్ స్టార్ అని మాత్రమే పిలవాలి, సెల్ఫీలు లేదా ఆటోగ్రాఫ్లు అడగకూడదు, వ్యక్తిగత ప్రశ్నలు వేయకూడదు, ఫోన్ కనిపించేలా పెట్టకూడదు వంటి అంశాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై నెటిజన్ల మధ్య తీవ్ర వాదనలు మొదలయ్యాయి. కొందరు సెలబ్రిటీ భద్రత కోసం ఇలాంటి మార్గదర్శకాలు సహజమేనని అంటుంటే... మరికొందరు మాత్రం ఇది అతిగా వ్యవహరించడమేనని విమర్శించారు.

ఇదే సమయంలో అల్లు అర్జున్ పీఆర్ టీమ్ అధికారికంగా స్పందించింది. కావేరీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, అల్లు అర్జున్ ఎప్పుడూ హుందాగా, గౌరవప్రదంగా వ్యవహరిస్తారని స్పష్టం చేసింది. ఈ ఆరోపణలను సీరియస్గా తీసుకుంటున్నామని, అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామని ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీంతో ఈ '42 పాయింట్స్' కథనానికి మరో మలుపు తిరిగింది. వివాదం మరింత ముదిరడంతో యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టగా, బన్నీ అభిమానులు రంగంలోకి దిగారు.
అల్లు అర్జున్ గతంలో అభిమానులతో సరదాగా మాట్లాడిన వీడియోలు, ఈవెంట్లలో ఆప్యాయంగా కలిసిన క్లిప్స్ షేర్ చేస్తూ ఆయన స్వభావాన్ని డిఫెండ్ చేస్తున్నారు. మరోవైపు పాడ్కాస్ట్ హోస్ట్ స్వీకృతి కూడా స్పందిస్తూ తమ గెస్ట్కు బెదిరింపులు వస్తున్నాయంటూ ఆ వీడియోను తొలగిస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ ఈ మొత్తం వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పలువురు తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
తాజాగా అల్లు అర్జున్ ప్రోటోకాల్ వివాదంపై నిర్మాత వంశీ నందిపాటి స్పష్టత ఇచ్చారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన 42 నిబంధనల జాబితా నేపథ్యంలో బన్నీ వ్యక్తిత్వంపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. వంశీ మాట్లాడుతూ... 'అల్లు అర్జున్ ఎంతో సాదాసీదాగా ఉంటారు. ఎవరైనా కలిస్తే ఆప్యాయంగా కౌగిలించుకుని పలకరిస్తారు. ఆయనతో కలిసి పని చేసిన అనుభవం నాకు ఉంది. అల్లు అర్జున్ చాలా మంచి మనిషి'అని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా పుకార్లేనని ఆయన తేల్చి చెప్పారు.
సెలబ్రిటీలకు భద్రతా కారణాల వల్ల కొన్ని మార్గదర్శకాలు ఉండటం సహజమని, వాటిని వ్యక్తిగత స్వభావంతో కలపడం సరికాదని వంశీ అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ పై వస్తున్న విమర్శలు పూర్తిగా అవాస్తవం, నిజానికి ఆయన అందరితో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి అని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించిన అల్లు అర్జున్పై ఇలాంటి కథనాలు రావడం సహజమేనని, అయితే వాస్తవాలను తెలుసుకోకుండా ప్రచారం చేయడం మంచిది కాదని వంశీ సూచించారు.


Click it and Unblock the Notifications











