నాపై తప్పుడు ప్రచారం .. 22 ఏళ్ల కష్టం , ఒక్క రాత్రిలో పొగొట్టేశారు : అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాట ప్రమాదవశాత్తూ జరిగిందని దీనికి మనస్పూర్తిగా రేవతి కుటుంబ సభ్యులకు సారీ చెబుతున్నానని అల్లు అర్జున్ అన్నారు. ఆసుపత్రిలో శ్రీతేజ్ కోలుకుంటున్నాడని .. ఇన్ని టెన్షన్స్ మధ్యలో అదొక్కటే ఆనందాన్ని ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. 20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారని.. ఎప్పుడైనా ఇలా చేశానా, ఏమైనా అన్నానా అని అల్లు అర్జున్ ప్రశ్నించారు.
నేను చేసిన పెద్ద హిట్ అయినా 15 రోజులుగా ఇల్లు దాటి బయటికి రావడం లేదని , అన్ని ప్రోగ్రామ్స్ పక్కనపెట్టేశానని కనీసం సినిమా ఇంత వరకు చూడలేదని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన దానిలో ప్రత్యక్షంగా నా ప్రేమయం లేదని కానీ నేనున్న ప్రదేశంలో జరిగింది కాబట్టి దానికి క్షమాపణలు చెబుతున్నానని బన్నీ తెలిపారు. తెలుగువాళ్ల పేరు ప్రఖ్యాతులను ఎక్కడో నిలబెడదామని మూడేళ్లు కష్టపడి చేశానని అలాంటిది నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు.

తానేం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించలేదని, గత 20 , 30 ఏళ్లుగా నా సినిమాలతో పాటు బయటి సినిమాలను కూడా అదే థియేటర్లో చూశానని అల్లు అర్జున్ తెలిపారు. సంధ్య థియేటర్కి వెళ్లేసరికి పోలీసులే మొత్తం క్లియర్ చేస్తున్నారని.. వాళ్ల డైరెక్షన్లోనే నేను నడుచుకున్నానని ఆయన వెల్లడించారు. నన్ను ఒక్కసారి చూస్తే కానీ జనం తప్పుకోరని పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తారని అందుకే మేం బయటికి వచ్చి ప్రేక్షకులకు అభివాదం చేస్తామని అల్లు అర్జున్ తెలిపారు.
వేలమంది నన్ను చూడటానికి వచ్చినప్పుడు నేను లోపల దాక్కోలేనని బన్నీ తేల్చిచెప్పారు. నేనేమీ రోడ్ షో చేయలేదని.. ఏ పోలీస్ ఆఫీసర్ వచ్చి నన్ను కలవలేదని అన్నారు. జనం బాగా వస్తున్నారని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని థియేటర్ యాజమాన్యం, పోలీసులు రిక్వెస్ట్ చేస్తే సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే నేను , నా భార్య వెళ్లిపోయామని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయారని, ఓ బాబు ప్రాణాపాయంలో ఉన్నాడని తర్వాతి రోజు తనకు తెలిసి షాకయ్యానని ఆయన వెల్లడించారు.
వెంటనే బన్నీ వాసుకి ఫోన్ చేసి వెంటనే థియేటర్ దగ్గరికి పంపించానని అల్లు అర్జున్ తెలిపారు. నేను ఆసుపత్రికి వస్తానంటే మీరు రావొద్దని అంత్యక్రియలు ముగిసిన తర్వాత రేవతి కుటుంబ సభ్యులను మీ దగ్గరికి తీసుకొస్తానని బన్నీ వాసు చెప్పాడని అల్లు అర్జున్ వెల్లడించారు. నా మీద కేసు బుక్ కావడంతో బాధిత కుటుంబాన్ని కలవొద్దని నా లీగల్ టీమ్ చెప్పిందని ఆయన తెలిపారు. చావు బతుకుల్లో ఉన్న వేరే హీరో అభిమానులనే వైజాగ్, విజయవాడ వరకు వెళ్లి కలిసి వచ్చానని.. అలాంటిది నా ఫ్యాన్స్ ఇలాంటి పరిస్ధితుల్లో ఉంటే వదిలేస్తానా అని అల్లు అర్జున్ ప్రశ్నించారు.

న్యాయపరమైన ఇబ్బందుల దృష్ట్యా వీడియో రిలీజ్ చేశానని ఆయన స్పష్టం చేశారు. సినిమా హిట్ అయ్యాక పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేద్దామని మేకర్స్ అడిగినా పరిస్ధితి ఇలా ఉంటే ఏం చేస్తామని అన్ని క్యాన్సిల్ చేశామన్నారు. తాను ఇంట్లో ఉన్నా ఆ కుటుంబం గురించే ఆలోచిస్తున్నానని.. బాబుకి మంచి మెడికల్ ఫెసిలిటీస్తో పాటు కొంత మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లా వేద్దామని అనుకున్నానని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవనే అని ఆయన అన్నారు. ఏం జరిగినా నేను తట్టుకుంటానని కానీ .. నా క్యారెక్టర్ను తక్కువ చేయడాన్ని తట్టుకోలేకపోతున్నానని అల్లు అర్జున్ తెలిపారు. 22 ఏళ్లుగా ఎంతో కష్టపడి సాధించిన నమ్మకం, గౌరవాన్ని ఒక్క రాత్రిలో పోగొట్టారని.. న్యాయపరమైన ఇబ్బందులు తొలగిన తర్వాత అన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తానని బన్నీ స్పష్టం చేశారు. తెలుగోడి సత్తా పెంచాలని చూస్తుంటే లాగేయ్యాలని చూస్తున్నారని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











