మొన్న వైసీపీ నేతతో.. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేతో, అల్లు అర్జున్ ప్లేట్ మార్చేశాడా? నెటిజన్ల ట్రోలింగ్!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , సార్వత్రిక ఎన్నికలు ఎన్నడూ లేనంత హాట్ హాట్గా సాగిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అందుకోవాలని టీడీపీ, నిలబెట్టుకోవాలని వైసీపీ హోరాహోరీగా తలపడ్డాయి. మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఎలక్షన్స్ కాస్తా రణరంగంగా మారాయి. పదేళ్లుగా ఎమ్మెల్యే అనిపించుకోవాలని పోరాటం చేస్తున్న పవన్ పిఠాపురంలో బరిలో నిలవడంతో ఆయన కోసం మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్, బంధుమిత్రులు ప్రచారం నిర్వహించారు. ప్రచారం కొద్దిగంటల్లో ముగుస్తుందనగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో ప్రత్యక్షమయ్యారు. బన్నీని చూసేందుకు అభిమానులు పోటెత్తగా.. ఆ వచ్చిన వారికి అభివాదం చేసిన ఆయన .. వైసీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. అల్లు అర్జున్ని పవన్కు శత్రుపక్షంగా ఉన్న వైసీపీ వైపు చూసి మెగా అభిమానులు షాకయ్యారు.
ఈ ఘటన తర్వాత మెగా కాంపౌండ్ మొత్తం బన్నీ అంటే చాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అదంతా మీడియా సృష్టే తప్పించి.. మెగా ఫ్యామిలీది ఎప్పుడూ ఒకే మాట, ఒకే బాట అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు అలాంటివి మరి. మెగా ఫ్యామిలీతో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉండేవాళ్లు, అభిమానులు ప్రస్తుతం అల్లు అర్జున్ పేరు చెబితే చాలు భగ్గుమంటున్నారు.

మెగా , అల్లు కుటుంబాలతో అత్యంత క్లోజ్గా ఉండే నిర్మాత బన్నీ వాసు వ్యాఖ్యలు సైతం రెండు ఫ్యామిలీ మధ్య ఏదో గ్యాప్ ఉన్నట్లుగానే మాట్లాడారు. కుటుంబం అన్నాక కొన్ని అనుకోని పరిస్ధితులు వస్తుంటాయని, కానీ ఆ ఫ్యామిలీ మొత్తం ఏకతాటిపై ఉందని చెప్పడానికి చిన్న ఇన్సిడెంట్ చాలు అని.. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు బన్నీ వాసు తెలిపారు. మెగా, పవన్ ఫ్యాన్స్కి భయపడి పుష్స-2ని వాయిదా వేశారనే టాక్ సైతం వినిపిస్తోంది.
ఇదంతా నిజం కాదని.. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ఆలస్యం కావడం వల్లే సినిమా వాయిదా పడిందని కొందరు డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారు. కానీ మెగా - అల్లు కుటుంబాల మధ్య మధ్య స్పష్టమైన విభజన రేఖ మాత్రం కనిపిస్తోందని ఫిలింనగర్ జనాలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ జరుగుతోందో, లేదో అన్న అనుమానాలు ఉన్నాయి. సుకుమార్, అల్లు అర్జున్లు ఫారిన్ ట్రిప్లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

నంద్యాలలో ప్రచారం, ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్ మళ్లీ ఆ తర్వాత ఏ ఈవెంట్లో కానీ, కుటుంబ కార్యక్రమాల్లో కానీ కనిపించలేదు. ఈ నేపథ్యంలో బన్నీ అతని సతీమణి స్నేహారెడ్డిలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు, స్వయానా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో కలిసి స్నేహా, అల్లు అర్జున్లు స్టెప్పులేయడం చర్చనీయాంశమైంది.
ఇందులో అస్మిత్ రెడ్డి మెడలో పూలదండలు ఉండగా.. సక్సెస్ సార్టీలో బన్నీ, స్నేహ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు , ఎక్కడ జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు. ఈ వీడియో నేపథ్యంలో అల్లు అర్జున్పై మరోసారి ట్రోలింగ్కు దిగారు నెటిజన్లు. బన్నీ ప్లేట్ ఫిరాయించేశాడా అని కొందరంటుంటే దానికి అల్లు ఫ్యాన్స్ కౌంటర్ వేస్తున్నారు. మా అన్నకు ఏ పార్టీతోనూ సంబంధం ఉండదని, నా అనుకున్న వారు ఏ పార్టీలో ఉన్నా అండగా ఉంటారని చెబుతున్నారు. మరి బన్నీ తాజా సెలబ్రేషన్స్ వివాదంగా మారుతుందా లేక ఇక్కడితో ఎండ్ అవుతుందా అన్నది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











