అల్లు అరవింద్ ఇంటికి పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ని ఓదార్చిన పవర్స్టార్
పవర్స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్స్టార్ అల్లు అర్జున్ మధ్య కొంత గ్యాప్ వచ్చిందని ఫిలింనగర్లో వినిపించే మాట. ఒకప్పుడు ఎంతో సన్నిహితంగా మెలిగేవారు కళ్యాణ్- అర్జున్. పవన్ను రామ్ చరణ్తో పాటే బాబాయ్ అని పిలవడం బన్నీ కూడా అలవాటు. మెగా ఫ్యామిలీలో అంతా కలిసి మెలిసి పెరగడంతో అందరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఓ సినిమా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అని చెప్పడంతో మెగా, అల్లు అర్జున్ అభిమానుల మధ్య వార్ మొదలైంది. అది రెండు కుటుంబాల మధ్య గ్యాప్కి దారి తీసింది.
విడిపోయిన మెగా- అల్లు అభిమానులు
పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ మధ్య విభేదాలతో మెగా, అల్లు అభిమానులు నలిగిపోతున్నారు. దీని ప్రభావం ఆయా హీరోలు నటించిన సినిమాలపైనా పడుతోంది. చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ తర్వాత పవన్, మెగా అభిమానులు అల్లు అర్జున్ సినిమాలను పక్కనపెట్టేశారు.ఇదే సమయంలో సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ కూడా ఓ రేంజ్లో జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన మేనమామ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కాకుండా.. పవన్కు బద్ధ శత్రువు లాంటి వైసీపీ అభ్యర్ధి తరపున ప్రచారం చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

నాగబాబు ట్వీట్తో దుమారం
ఈ దెబ్బతో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మా వాడైనా శత్రువుకు సాయం చేసేవాడు మాకు శత్రువేనంటూ నాగబాబు పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టించింది. ఈ తర్వాత అల్లు అర్జున్, స్నేహ దంపతులను సాయి థరమ్ తేజ్ తన సోషల్ మీడియా ఖాతాలలో అన్ఫాలో చేశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక మెగా నివాసంలో నిర్వహించిన సక్సెస్మీట్లో, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎక్కడా అల్లు ఫ్యామిలీ జాడ కనిపించలేదు.
అల్లు అర్జున్ అరెస్ట్తో రంగంలోకి చిరు
అయితే అల్లు అర్జున్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబం మొత్తం అల్లు ఫ్యామిలీకి అండగా నిలిచింది. జైలు నుంచి విడుదలైన వెంటనే నేరుగా చిరంజీవి, నాగబాబుల నివాసానికి వెళ్లిన అల్లు అర్జున్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల మెగాస్టార్ 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. దీంతో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ తగ్గినట్లుగానే భావించారు. తాజాగా చాలాకాలం తర్వాత మెగా, అల్లు ఫ్యామిలీలు ఒకే చోట కనిపించి తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తామంతా ఒక్కటేనని నిరూపించారు.
ఒకేచోట అల్లు, మెగా ఫ్యామిలీలు
దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ ఆగస్ట్ 29న కన్నుమూశారు. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అరవింద్ నివాసానికి తరలివచ్చింది. చిరంజీవి, సురేఖలతో పాటు అమ్మమ్మ మరణవార్త తెలుసుకున్న రామ్ చరణ్ మైసూర్లో షూటింగ్ రద్దు చేసుకుని హైదరాబాద్కు వచ్చారు. అల్లు అరవింద్ ఇంటి వద్ద స్వయంగా అల్లు అర్జున్ .. రామ్ చరణ్ను రిసీవ్ చేసుకుని హత్తుకున్నారు. అనంతరం మేనమామ అరవింద్, ఇతర బంధుమిత్రులను చరణ్ ఓదార్చారు. కనకరత్నమ్మ అంత్యక్రియలు ముగిసేవరకు మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అరవింద్ వెంటే ఉన్నారు. అత్తగారి పాడెను స్వయంగా చిరంజీవి మోశారు.
అల్లు అరవింద్ నివాసానికి పవన్
తాజాగా పవర్స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అల్లు అరవింద్ నివాసానికి వచ్చారు. శనివారమే ఆయన కనకరత్నమ్మ భౌతికకాయానికి నివాళులర్పించాల్సింది.. అయితే విశాఖలో జనసేన పార్టీ సమావేశం ఉండటంతో నాగబాబు, పవన్ కళ్యాణ్లు రాలేకపోయారు. దీంతో పవన్ ఆదివారం అల్లు నివాసానికి చేరుకుని అరవింద్, అల్లు అర్జున్లను ఓదార్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మెగా, పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











