Allu Sirish- Nayanika Wedding: అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు.. స్పెషల్ అట్రాక్షన్గా విజయ్- రష్మిక!
టాలీవుడ్లో వరుసపెట్టి శుభకార్యాలు జరుగుతున్నాయి. లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు సుధీర్ఘకాలంగా సాగుతున్న ప్రేమాయణానికి చెక్ పెట్టి దంపతులుగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్లో రష్మిక - విజయ్ల పెళ్లి జరిగింది. దాంతో ప్రస్తుతం టాలీవుడ్లో అందరి కన్ను అల్లు ఫ్యామిలీపై పడింది. మెగా ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్- నయనిక రెడ్డిల వివాహం మార్చి 6వ తేదీన హైదరాబాద్లో జరగనుంది. ఇప్పటికే రెండు కుటుంబాలు భారీ ఏర్పాట్లు చేస్తుండగా.. వీరి వివాహానికి తెలుగు సినీ, రాజకీయ, వ్యాపార తదితర రంగాలకు చెందిన ప్రముఖులు తరలిరానున్నారు
నయనిక రెడ్డితో ప్రేమలో పడిన అల్లు శిరీష్ ఆమెతో కొన్నాళ్లపాటు ప్రేమాయణం సాగించారు. అనంతరం ఇరు కుటుంబాల అంగీకారంతో తాను నయనికను పెళ్లాడబోతున్నట్లు గతేడాది అల్లు శిరీష్ అధికారికంగా ప్రకటించారు. గతేడాది అక్టోబర్లో అల్లు శిరీష్ - నయనిక రెడ్డిల ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లిని మార్చి 6వ తేదీన జరపనున్నట్లు వధూవరుల కుటుంబాలు అధికారికంగా ప్రకటించాయి. మార్చి 6వ తేదీకి అల్లు కుటుంబంలో ప్రత్యేక స్థానముంది. ఐకాన్స్టార్ అల్లు అర్జున్ - స్నేహారెడ్డి దంపతుల పెళ్లి రోజు కూడా అదే రోజు కావడం విశేషం. అన్నావదినల పెళ్లి రోజే తాను కూడా వైవాహిక బంధంలో అడుగుపెట్టాలని అల్లు శిరీష్ నిర్ణయించుకుని వారిపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

పెళ్లి రోజు దగ్గరపడటంతో అల్లు శిరీష్ - నయనిక రెడ్డిలు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశారు. వరుస పెట్టి పార్టీల మీద పార్టీలు జరుపుకుంటూ స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నారు. తొలుత దుబాయ్లోని లగ్జరీ యాట్లో అల్లు శిరీష్ - నయనిక రెడ్డిల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. వధూవరుల స్నేహితులో పాటు అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు బాబీ తదితర సన్నిహితులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక ఇటీవల హైదరాబాద్లో తమ్ముడి కోసం అల్లు అర్జున్ ప్రైవేట్ పార్టీ ఇచ్చారు. ఇందులో స్టార్ హీరోయిన్లతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.
ఇదే సమయంలో ఇరు కుటుంబాల్లోనూ పెళ్లి పనులు మొదలైపోయాయి. ఇప్పటికే అల్లు అరవింద్ నివాసంలో పసుపు దంచే కార్యక్రమం మొదలుపెట్టేశారు. అల్లు, కొణిదెల కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు, సన్నిహితులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అలాగే శుభలేఖలు పంచే కార్యక్రమాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అల్లు కుటుంబం. తొలి పెళ్లి పత్రికను తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతులకు అందజేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు శిరీష్. తర్వాత చిరంజీవి సోదరులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబుతో పాటు ఇతర బంధుమిత్రులకు అందించి తన పెళ్లికి ఆహ్వానించారు.
పెళ్లికి మరో 5 రోజులే వ్యవధి ఉండటంతో అల్లు కుటుంబంలో పెళ్లి వేడుకలు జోరందుకున్నాయి. తాజాగా మార్చి 1వ తేదీన అల్లు శిరీష్ను పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. కొత్త జంట విజయ్ దేవరకొండ- రష్మికలు అల్లు అరవింద్ నివాసానికి చేరుకుని అందరికీ సర్ప్రైజ్ చేశారు. వీరి రాకతో కార్యక్రమంలో సందడి నెలకొంది. విరోష్ జంటతో ఫోటోలు దిగి.. వీరికి కూడా శుభాకాంక్షలు తెలిపేందుకు అక్కడున్న వారు ఎగబడ్డారు. ప్రస్తుతం విజయ్- రష్మికల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











