నువ్వు చూశావా? నువ్వొచ్చి తీయ్.. హరిహర వీరమల్లుపై నెగిటివ్ ప్రచారంపై ఏఎం రత్నం
ఇటీవలి కాలంలో సినిమాల్ని దెబ్బతీస్తోన్న అంశం నెగిటివ్ పబ్లిసిటీ. ఫ్యాన్ వార్కు, ఇండస్ట్రీలోని రాజకీయాలకు మంచి సినిమాలు బలైపోతున్నాయి. రామ్ చరణ్ - శంకర్ల గేమ్ ఛేంజర్పై నెగిటివ్ పబ్లిసిటీ ప్రభావం పడి భారీగా నష్టాలు మిగిల్చింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి సైతం ఆవేదన వ్యక్తం చేశారంటే పరిస్ధితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. గేమ్ ఛేంజర్ వివాదం తర్వాత కూడా పరిస్ధితుల్లో ఏమాత్రం మార్పురాలేదు. కొందరు ఉద్దేశపూర్వకంగా కొన్ని సినిమాల్ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేయించిన ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విషయంలోనూ నెగిటివ్ ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..
పగలూ రాత్రీ కష్టపడ్డ పవన్ కళ్యాణ్
రాజకీయాల్లోకి వెళ్లిపోయిన తమ అభిమాన నటుడిని తిరిగి వెండితెర మీద చూస్తామా లేదా అన్న భయాలు వెంటాడుతున్న వేళ పవన్ కళ్యాణ్ తను కమిటైన సినిమాలను ఒక్కొక్కటిగా కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడెప్పుడో కరోనాకు ముందు మొదలైన హరిహర వీరమల్లును ఫినిష్ చేసి నిర్మాత ఏఎం రత్నంపై పడిన భారాన్ని తొలగించాలని భావించారు. రాజకీయాలు, పాలనా వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ రాత్రి, పగలు ఇలా ఎప్పుడు వీలైతే అప్పుడు షూటింగ్లో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం.

అనూహ్యంగా వాయిదాపడ్డ హరిహర వీరమల్లు
తన పార్ట్ షూటింగ్ను దిగ్విజయంగా పూర్తి చేసి, కేవలం నాలుగు గంటల పాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి వృత్తిపై తన నిబద్ధతను చాటుకున్నారు పవన్ కళ్యాణ్. యూనిట్ సభ్యుల కష్టం, పవన్ చొరవతో హరిహర వీరమల్లును విడుదలకు సిద్ధం చేసి జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఏఎం రత్నం. తిరుపతిలో జూన్ 8న భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని కూడా ప్లాన్ చేశారు. కానీ అనివార్య కారణాలతో హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడింది. సినిమాను జూన్ 12వ తేదీకి తీసుకురావాలని అనుకున్నామని, కానీ కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనిట్ ప్రకటించింది. దీంతో పవన్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
హరిహర వీరమల్లు వాయిదాపై రూమర్స్
అయితే హరిహర వీరమల్లు వాయిదా పడటంపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు సర్క్యూలేట్ అవుతున్నాయి. గత కొద్దిరోజులుగా మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు నిర్మాత ఏఎం రత్నంకు రకరకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో హరిహర వీరమల్లుపై నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతోందని.. సినిమా ఆగిపోయిందని, నిర్మాత ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని రాస్తున్నారని తెలిపారు. అలాంటి రాతల వల్ల సినిమా బిజినెస్, ఫైనాన్స్ మీద ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకే కాదు.. ఏ నిర్మాతకైనా అంతేనని అన్నారు.
నా ముందు అలాంటి మాటలు
ఓ వ్యక్తి అయితే మరీ దారుణంగా మాట్లాడాడనీ, సినిమా ఇంత బాగా తీస్తే .. సినిమా కంప్లీట్ కాదనుకున్నామని, పూర్తి చేసేశాడని అన్నాడని ఏఎం రత్నం వ్యాఖ్యానించారు. సినిమా ఒక చెత్త, అనవసరంగా దీనిని ప్రమోట్ చేస్తున్నారని కామెంట్ చేశాడని మండిపడ్డారు. నువ్వు సినిమా చూశావా? అసలు సినిమా గురించి గురించి తెలుసా? నువ్వొచ్చి సినిమా తీయ్ అని అతనితో అనాలనిపించింది అని రత్నం వ్యాఖ్యానించారు. వీరమల్లు రిలీజైన తర్వాత సినిమానే మాట్లాడుతుందని, విజయమే వాళ్ల నోరు మూయిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఏఎం రత్నంతోనే ఆ మాటలు ఎవరు మాట్లాడారంటూ పవన్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











