సమంతపై అమల ఫిదా.. చైతన్యతో విడాకుల తర్వాత కూడా!
స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య - సమంత విడాకులు తీసుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు అతిపెద్ద షాక్. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట చాలా తక్కువ సమయంలోనే విడాకులు తీసుకుని అభిమానులను, కుటుంబ సభ్యులను నిరాశకు గురిచేశారు. వీరిద్దరూ తిరిగి ఒక్కటవుతారని కొందరు అనుకున్నారు. అయితే ఈ ఆశలను అడియాశలు చేస్తూ శోభిత ధూళిపాళ్ల మెడలో నాగచైతన్య మూడు ముళ్లు వేశారు. మరోవైపు దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న వేళ ఆమె మాజీ అత్తగారు అమల అక్కినేనితో కలిసి ఒకే వేదికపై కనిపించడం చర్చనీయాంశమైంది. ఈ వివరాల్లోకి వెళితే.
నాలుగేళ్లకే విడిపోయిన సామ్ - చైతూ
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏమాయ చేశావే సమయంలో ప్రేమలో పడిన సామ్- చైతన్యలు కొన్నాళ్లు డేటింగ్ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో గోవాలో ఒక్కటయ్యారు. తమ దాంపత్యానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వీరు అన్యోన్యంగానే ఉన్నారు. కరోనా సమయంలో లాక్డౌన్ కారణంగా ఇంటికి పరిమితమైన సమంత- నాగచైతన్యల మధ్య బాండింగ్ మరింత పెరిగింది. ఇక ఈవెంట్స్, పార్టీలు, ఇతర శుభకార్యాలలో ఈ జంట సెంటరాఫ్ అట్రాక్షన్గా ఉండేది.

శోభితను పెళ్లాడిన చైతన్య
త్వరలోనే శుభవార్త చెబుతారని అంతా అనుకుంటూ ఉండగా విడిపోతున్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చారు సమంత- నాగచైతన్య. అసలు వీరిద్దరి మధ్య విడాకులకు దారి తీసిన కారణాలేంటో ఎవరికీ అంతు పట్టలేదు. ఎవరి దారులు వారివి కాగా.. ఇటీవలే మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నా చైతన్య. అటు బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత క్లోజ్గా ఉండటంతో ఎన్నో గాసిప్స్ వస్తున్నాయి. వీటిని వీరిద్దరూ ఖండించినా ఈ పుకార్లకు మాత్రం చెక్ పడటం లేదు.
15 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత
నాగచైతన్యతో విడిపోయినప్పటికీ అక్కినేని కుటుంబంపై సమంత ఏనాడూ కోపం ప్రదర్శించలేదు. మొన్నామధ్య రానాతో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా ఆయనతో నవ్వుతూనే మాట్లాడారు. ఒక్క చైతన్య తప్పించి అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యుల ఖాతాలను ఆమె నేటికీ ఫాలో అవుతున్నారు. తాజాగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా జీ తెలుగు నిర్వహించిన అప్సర అవార్డ్స్ 2025 ఈవెంట్లో సమంతను వేదికపై ప్రత్యేకంగా సత్కరించారు. అలాగే ఓ పురస్కారాన్ని కూడా ఆమెకు అందజేశారు.
సమంత స్పీచ్కు అమల చప్పట్లు
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ నాకు కర్మభూమి, తన జీవితంలో తొలి ప్రాధాన్యం తెలుగు ప్రేక్షకులేనని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అక్కినేని నాగార్జున సతీమణి, సమంత మాజీ అత్తగారు అమల నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమానికి రోజా, అమల, సుకుమార్, రమ్యకృష్ణ, అనిల్ రావిపూడి సహా పలువురు స్టార్స్ హాజరయ్యారు. ఈ వీడియోను అక్కినేని అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











