Akhanda 2: అఖండ 2 వాయిదా వేళ.. ప్రభాస్ ‘రాజా సాబ్' రూమర్స్పై నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్..
Akhanda2 -The Rajasaab: నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన మూవీ 'అఖండ 2'. ఈ మూవీ డిసెంబర్ 5న గ్రాండ్ విడుదల కావాల్సింది. కానీ, ఆఖరు నిమిషంలో హైకోర్టు ఆదేశాలతో విడుదల పూర్తిగా ఆగిపోయింది. ఈ సినిమాను నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీపై ఎరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన కేసు కారణంగా ఈ భారీ బడ్జెట్ మూవీ విడుదల వాయిదా పడింది. ఈ పరిణామంపై సినీ అభిమానులకు మాత్రమే కాదు, పరిశ్రమలోని పలువురినీ కలవరపరిచింది. ఈ ఘటనపై తాజాగా రాజాసాబ్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ స్పందించారు.
అఖండ 2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సింది. కానీ, ఈ మూవీ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీపై ఎరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన కేసు కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఎరోస్ సంస్థ గతంలో 14 రీల్స్తో కలిసి చేసిన ఒప్పందం ప్రకారం.. రూ. 28 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం చెల్లించకపోవడంతో ఎరోస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు డిసెంబర్ 4 అర్ధరాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి. దాంతో ప్రీమియర్ షోలు, బుకింగ్స్ అన్నీ రద్దయ్యాయి. ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో అఖండ 2 విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు.

తాజాగా అఖండ 2 వాయిదాపై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ యజమాని, నిర్మాత విశ్వ ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 'ఇలాంటి భారీ బడ్జెట్ మూవీస్ రిలీజ్కు కొన్ని గంటలు ముందు.. వాయిదా పడటం అత్యంత దురదృష్టకరం. పెద్ద సినిమాల రిలీజ్ను బట్టి చిన్న సినిమాలు తమ ప్లాన్ వేసుకుంటాయి. ఇటువంటి నిర్ణయాలు పరిశ్రమలోని ఇతర వర్గాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి" అన్నారు.
'సినిమా విడుదల వాయిదా పడటం వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, టెక్నీషియన్లు, ఎగ్జిబిటర్లతో పాటు ఈ వ్యవస్థలో పనిచేసే వేలాది మంది జీవనాధారం దెబ్బతింటుంది. కావున భవిష్యత్తులో ఇలాంటి జోక్యాలను తప్పించేందుకు ఖచ్చితమైన చట్టపరమైన మార్గదర్శకాలు అవసరం' అని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఈ తరహా పరిస్థితులు మళ్లీ రాకుండా బాధ్యత గల ప్రతీ వర్గం ముందుగానే సమస్యలను పరిష్కరించుకునేలా వ్యవస్థ ఉండాలన్నారు.
అదే సమయంలో ప్రభాస్ 'ది రాజాసాబ్' సినిమాపై వస్తున్న ఆర్థిక ఆలస్యం పుకార్లను కూడా విశ్వ ప్రసాద్ ఖండించారు. 'రాజాసాబ్కు సంబంధించి అన్ని పెట్టుబడులూ పూర్తిగా క్లియర్ అయ్యాయి. ఇంటర్నల్ ఫండ్స్తోనే పూర్తి చేస్తున్నాం. 2026 జనవరి 9న గ్రాండ్ రిలీజ్ ఖాయం'అని స్పష్టం చేశారు.అఖండ వాయిదా వల్ల తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త చర్చను రేకెత్తించింది. రిలీజ్ షెడ్యూల్స్పై నమ్మకం సన్నగిల్లుతోందని, ఇలాంటి చివరి నిమిషం ఆటంకాలు భవిష్యత్తులో మరిన్ని నష్టాలు వస్తాయని తెలిపారు.
అఖండ 2 కూడా అన్ని సమస్యలు సర్దుబాటు అయ్యి, త్వరలో భారీగా థియేటర్లలో సందడి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.అఖండ 2తో పాటు డిసెంబర్లో విడుదల కానున్న ఇతర సినిమాలు, సంక్రాంతి రేసులో ఉన్న రాజాసాబ్, మన సంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి, జన నాయకన్, పరాశక్తి వంటి సినిమాలు విజయం సాధించాలని కోరుకున్నారు. రాబోయే పండగ సీజన్ తెలుగు సినిమాకి మరింత పెద్ద విజయాలు అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











