రష్మిక-విజయ్ దేవరకొండ పాటతో 19 లక్షలు.. అనంత శ్రీరామ్కు జాక్ పాట్..
Ananta Sriram: తెలుగు సినీ పరిశ్రమలో గేయ రచయితలలో ప్రత్యేకమైన శైలి, భావుకతతో తనదైన ముద్ర వేసుకున్న పేరు అనంత శ్రీరామ్. మాస్ భాషలోనే లోతైన తాత్వికతను చెప్పగలిగే అరుదైన రచయితగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఆయన రాసిన 'రై రై రారా...' పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, మరోసారి తన కలం శక్తిని చాటింది. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమాలో ఈ పాటకు మంచి రెస్పాన్స్ రావడం విశేషం. అయితే.. తాను రాసిన ఓ పాటకు 19 లక్షల వరకూ ఆదాయం వచ్చిందని చెప్పారు. ఇంతకీ ఆ పాట ఏంటీ?
అనంత శ్రీరామ్ చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి, ఇప్పటివరకు వెయ్యికి పైగా పాటలు రాసి విశేష ఖ్యాతిని సంపాదించారు.'కాదంటే అవుననిలే'తో ప్రారంభమైన ఆయన ప్రయాణం, 'మగధీర', 'బాహుబలి', 'రంగస్థలం', 'పెద్ది' వంటి సినిమాల వరకు విస్తరించింది. ప్రేమ గీతాలు నుంచి భావోద్వేగ గీతాల వరకు, మాస్ పాటల నుంచి తాత్విక భావాల వరకు విభిన్న శైలుల్లో రాసిన ఆయన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

పింగళి, ఆత్రేయ, సిరివెన్నెల వంటి దిగ్గజాల ప్రభావంతో వచ్చిన కొత్త తరం గేయ రచయితగా అనంత శ్రీరామ్ ఎదిగారు. సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యే పదాలతో లోతైన భావాలను వ్యక్తపరచడం ఆయన ప్రత్యేకత. 'ఇంకేం కావాలే', 'పచ్చబొట్టు', 'కళావతి', ఇప్పుడు 'రై రై రారా...' వంటి పాటలు ఆయన ప్రతిభకు నిదర్శనాలు. సాహిత్యంపై మక్కువతో, చిన్నప్పటి నుంచే పాటలు రాయడం ప్రారంభించిన అనంత శ్రీరామ్ నేడు టాలీవుడ్లో టాప్ లిరిసిస్ట్గా నిలిచారు.
తాజా ఇంటర్వ్యూలో ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా గేయ రచయితలకు వచ్చే ఆదాయం, రాయల్టీ వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా ఒక పాటకు రచయితలకు ఇచ్చే రెమ్యునరేషన్ పెద్దగా ఉండదని, కానీ ఆ పాట హిట్ అయితే రాయల్టీల రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయం రావచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 2018లో విడుదలైన 'గీత గోవిందం' సినిమాలోని 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే' పాట గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
'ప్రభాస్ అంటే నాకు క్రష్.. ఆయన పక్కన అలా నటించను'
ఈ పాట భారీ హిట్ కావడంతో, విడుదలైన తర్వాత కూడా ఎన్నో ప్లాట్ఫామ్లలో వినిపిస్తూ, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తనకు ఆ పాట ద్వారానే సుమారు రూ.18 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు రాయల్టీ రూపంలో ఆదాయం వచ్చిందని వెల్లడించారు.'పాట రాస్తే ముందుగా వచ్చే పారితోషికం వేలల్లోనే ఉంటుంది. కానీ అదే పాట ప్రజాదరణ పొందితే, దాని వలన వచ్చే రాయల్టీలు లక్షల్లోకి చేరుతాయి" అని ఆయన వివరించారు. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ఫామ్లు, యూట్యూబ్, మ్యూజిక్ యాప్స్లో పాటలు ఎక్కువగా వినిపించబడితే, ఆ మేరకు రచయితలకు కూడా ఆదాయం వస్తుందని తెలిపారు.
ఇక రామ్ చరణ్ పెద్ది లోని 'రై రై రా రారా...' పాట గురించి మాట్లాడుతూ..ఒక మంచి పాట రాయడం లేదా మాస్ నంబర్ రూపొందించడం అంత కష్టమైన పని కాదని, కానీ మాస్ స్టైల్లోనే లోతైన తాత్వికతను వ్యక్తపరచడం మాత్రం చాలా సవాలుగా ఉంటుందని అనంత శ్రీరామ్ తెలిపారు. 'పెద్ది' సినిమా కోసం తాను రాసిన 'రై రై రా రారా...' పాటలో అదే ప్రయోగం చేశానని చెప్పారు. మాస్కు నచ్చే పదాలతో పాటు లోపల ఫిలాసఫీని కలపడం కత్తిమీద సాములా అనిపించిందని పేర్కొన్నారు.
ఇంకా సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ ఇచ్చిన ట్యూన్ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కూడా సమయం పట్టిందని ఆయన తెలిపారు. ఆ బాణీకి సరిపోయేలా పదాలు కూర్చడం కోసం ఎన్నో రోజుల పాటు ఆలోచించాల్సి వచ్చిందని చెప్పారు. మొత్తానికి ఈ ఒక్క పాటను పూర్తి చేయడానికి దాదాపు రెండు నెలల సమయం తీసుకున్నానని అనంత శ్రీరామ్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications


















