దటీజ్ వైఎస్ జగన్... సిరివెన్నెల కుటుంబానికి అండగా.. మానవత్వాన్ని ప్రదర్శించిన ఏపీ సీఎం
దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో ఒక్కసారిగా తెలుగు సినిమా పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఎల్లప్పుడూ నవ్వుతూ చలాకీగా కనిపించే సిరివెన్నెల ఉన్నట్టుంది అంతర్ధానం కావడాన్ని సినీ లోకం జీర్ణించుకోలేకపోతున్నది. ఆయన మహాభినిష్క్రమణతో సినీ ప్రముఖులు, అభిమానులు తల్లడిల్లుతున్నారు. అయితే ఆయన మృత్యువుతో పోరాడుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన ఆపన్నహస్తం ఇప్పడు చర్చనీయాంశమైంది. సీఎం జగన్ మానవత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

నవంబర్ 24వ తేదీన కిమ్స్ హాస్పిటల్లో
ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి సర్జరీ కోసం నవంబర్ 24వ తేదీన హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చేరారు. అయితే సర్జరీ తర్వాత రెండు రోజులు ఆరోగ్యంగా కనిపించారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం విషమించడంతో ఎక్మోపై ఉంచి చికిత్సను అందించారు.

సిరివెన్నెల ఆరోగ్యం గురించి ఏపీ సీఎం వాకబు
నవంబర్ 30 తేదీ ఉదయం 10 గంటలకు కిమ్స్ హాస్పిటల్లో ఉన్న సిరివెన్నెల ఆరోగ్యం గురించి ఎంక్వయిరీ చేస్తూ వైద్య వర్గాలకు ఫోన్ కాల్ వచ్చింది. సిరివెన్నెలకు అయ్యే హాస్పిటల్ ఖర్చులన్ని భరించమని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిసింది. హాస్పిటల్ ఖర్చులన్నీ భరించాలని నిర్ణయం తీసుకొన్నారు అని సిరివెన్నెల కుమారుడు సాయి యోగేశ్వర్, కుటుంబ సభ్యులు తెలిపారు.

వైఎస్ జగన్కు సిరివెన్నెల కుటుంబం
నాన్నగారి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ యాజమాన్యానికి కట్టిన అడ్వాన్స్ని కూడా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. సిరివెన్నెలగారి పట్ల ఇంత ప్రేమానురాగాలు చూపించి, మా కుటుంబానికి అండగా నిలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డికి మా కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం అని సాయి యోగేశ్వర్ మరియు ఇతర కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

అంత్యక్రియలకు ఆళ్ల నాని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలకు హాజరయ్యారు. ఫిలింనగర్లోని తెలుగు ఫిలిం చాంబర్లో ప్రజల సందర్శనార్థం ఉంచిన సిరివెన్నెల భౌతికకాయానికి నాని శ్రద్దాంజలి ఘటించారు. విషాద సమయంలో నైతికంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతాభివందనాలు మనస్పూర్తిగా తెలియజేసుకొన్నది.

సిరివెన్నెల కుటుంబానికి అండగా తెలంగాణ ప్రభుత్వం
అలాగే సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం కూడా అండగా నిలిచింది. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సీతారామశాస్త్రి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున తాము అందించే సాయం గురించి ప్రస్తావించారు. మా కుటుంబానికి అండగా ఉంటామని తలసాని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకొన్నది.
Recommended Video

సిరివెన్నెల అంత్యక్రియలు పూర్తి
ఇదిలా ఉండగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో హిందూ సంప్రదాయల ప్రకారం నిర్వహించారు. బాధతప్త హృదయంతో అభిమానులు, సినీ ప్రముఖులు సిరివెన్నెలకు కన్నీటి వీడ్కోలు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.


Click it and Unblock the Notifications











