AP Election Results Live: పవన్ కల్యాణ్పై విద్వేషం..‘ప్యాకేజీ’ మంత్రుల దారుణ ఓటమి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కూటమి అభ్యర్ధులు ఘన విజయం సాధిస్తున్నారు. 161 స్థానాల్లో కూటమి అభ్యర్ధులు స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుండగా.. అధికార వైసీపీ మాత్రం కేవలం 14 స్థానాల్లో ముందంజలో ఉంది. కౌంటింగ్ ముగిసే నాటికి ఎన్ని స్థానాలు ఫ్యాన్ పార్టీకి మిగులుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 9వ తేదీన అమరావతి వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం నేపథ్యంలో తెలుగుదేశం , జనసేన, బీజేపీ కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాల్చుతూ , మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు ఫలితాల నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం జగన్ అధికారిక నివాసం, వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. వైసీపీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరాశలో మునిగిపోయారు. మంత్రులు, మాజీ మంత్రులు , ఇతర కీలక వైసీపీ నేతలు ఓటమి పాలవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలావుండగా.. ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్న దొర, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడదల రజనీ, మేరుగు నాగార్జున, జోగి రమేష్, కాకాణి గోవర్థన్ రెడ్డి, ఉషశ్రీ చరణ్, స్పీకర్ తమ్మినేని సీతారాం, కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలు ఓటమి పాలయ్యారు.
అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విద్వేషమే మంత్రులు, ఇతర కీలక నేతల కొంపముంచిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు , ర్యాలీలు నిర్వహించినా వైసీపీ నేతలు ఆయన మీద విరుచుకుపడేవారు. ఎప్పుడు చూడు మూడు పెళ్లిళ్లు, దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ పవన్పై విమర్శలు చేసేవారు. ముఖ్యంగా అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్, పేర్నినాని, జోగి రమేశ్ లు ఒంటికాలిపై లేచేవారు.

పవన్ కళ్యాణ్ ఒకదశలో వీటిని అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ వైసీపీ నేతల విమర్శలు శృతిమించడంతో ఆయన సైతం రియాక్ట్ కాక తప్పలేదు. తనను పదే పదే ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శించిన వారికి చెప్పుతో కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. కానీ మంత్రుల ఆగడాలను, పవన్పై చేసిన విమర్శలను ప్రజలు, పవన్ కళ్యాణ్ అభిమానులు గుర్తుపెట్టుకున్నారు. ఎన్నికల్లో వీరి అంతు చూస్తామని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.
చివరికి పవన్ కళ్యాణ్పై చూపిన విద్వేషమే మంత్రులు, ఇతర కీలక నేతల ఓటమికి కారణమైందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. విమర్శలు రాజకీయంగా ఉండాలి తప్పించి, వ్యక్తిగతంగా , సభ్యసమాజం తలదించుకునేలా ఉండకూడదని .. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారని తాజా ఫలితాలు చెబుతున్నాయి. పవన్ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని ఈ ఎన్నికల్లో తను పోటీ చేయకుండా కుమారుడు పేర్ని కిట్టును బరిలో దించి.. ఓటమి నుంచి తప్పించుకున్నారంటూ సోషల్ మీడియాలో సెటర్లు పేలుస్తున్నారు.


Click it and Unblock the Notifications











