తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం: ఎన్టీఆర్, మహేశ్తో సినిమాలు చేసిన నిర్మాత కన్నుమూత
ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమల్లో వరుసగా విషాదాలు జరుగుతున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా ఇప్పటికే చాలా మంది గొప్ప గొప్ప ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల వ్యవధిలోనే ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఇలా సినీ రంగంతో సంబంధం ఉన్న పలువురు ప్రముఖులు ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో పెను విషాదం చోటు చేసుకుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దాదాపు 20కి పైగా చిత్రాలను నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్ ఆర్ఆర్ వెంకట్ సోమవారం ఉదయం కన్నుమూశారు.
డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ను ప్రారంభించి.. ఆ తర్వాత నిర్మాతగా మారిన ఆర్ఆర్ వెంకట్ సోమవారం ఉదయం అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతోన్న ఆయన.. అందుకోసం చికిత్సను తీసుకుంటున్నారు. ఈ కారణంగానే సినిమాలకు సైతం దూరం అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఆయన ఆరోగ్యం మరింతగా క్షిణించింది. దీంతో హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలీలో ఉన్న ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్సను తీసుకుంటోన్న క్రమంలోనే పరిస్థితి విషమించింది. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున ఆర్ఆర్ వెంకట్ తుదిశ్వాసను విడిచారు.

సినీయర్ ప్రొడ్యూసర్ ఆర్ఆర్ వెంకట్ మరణ వార్తతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం అలముకుంది. ఆయన మరణంపై పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు. అలాగే, దేశ వ్యాప్తంగా ఆయనతో పరిచయం ఉన్న వాళ్లంతా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. ఇక, ఆర్ఆర్ వెంకట్ అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం కానీ సాయంత్రం సమయంలో కానీ జరుగుతాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పార్థీవ దేహాన్ని ఆస్పత్రి నుంచి స్వగృహానికి తరలిస్తున్నారని సమాచారం. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచుతారని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.
ఆర్ఆర్ వెంకట్ ఆర్ఆర్ మూవీ మేకర్స్ అనే సంస్థను ప్రారంభించి ఎన్నో చిత్రాలను పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే జగపతి బాబు నటించిన 'సామాన్యుడు' అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత ఆయన రవితేజతో 'మిరపకాయ్', 'కిక్', 'డాన్ శీను', మహేశ్ బాబుతో 'బిజినెస్మ్యాన్', జూనియర్ ఎన్టీఆర్తో 'ఆంధ్రావాలా', వంటి భారీ చిత్రాలతో పాటు 'ప్రేమ కావాలి', 'ఢమరుకం', 'ఆటోనగర్ సూర్య' 'పైసా', 'పూల రంగడు', 'లవ్లీ', 'మాయాజాలం', 'విక్టరీ', 'బహుమతి', 'గుండమ్మ గారి మనవడు' వంటి సినిమాలను కూడా నిర్మించారు.
ఆర్ఆర్ వెంకట్ తెలుగులో ఎన్నో భారీ చిత్రాలను నిర్మించి బడా ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో హిందీలో 'ఏక్ హసీనా థీ', 'జేమ్స్' అనే చిత్రాలను సైతం నిర్మించి సత్తా చాటారు. అంతేకాదు, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఆహ్వానం' అనే సినిమాను.. హాలీవుడ్లోకి 'డైవర్స్ ఇన్విటేషన్' అనే టైటిల్తో రీమేక్ చేశారు. ఇందులో జోనథన్ బెన్నెట్ హీరోగా నటించాడు. ఇలా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో చిత్రాలను నిర్మించిన ఆర్ఆర్ వెంకట్ మరణంపై ఫీల్మీబీట్ సంతాపం తెలియజేస్తుంది.


Click it and Unblock the Notifications











