వెంకీ పాటకు అనిల్ రావిపూడి స్టెప్పులు, స్టేజ్ దద్దరిల్లిందిగా
అనిల్ రావిపూడి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. జంధ్యాల, ఈవీవీ, శ్రీనువైట్ల తర్వాత కామెడీని హీరోని చేసిన దర్శకుడు. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్స్లో అనిల్ ఒకరు. ఆయన ఎక్కడుంటే అక్కడ అల్లరి ఉండాల్సిందే. తన కామెడీ పంచ్లతో వెండితెరపైనే కాకుండా రియల్ లైఫ్లోనూ తోటివారిని నవ్విస్తూ ఉంటారు. డైరెక్టర్గానే అనిల్ రావిపూడి మల్టీటాలెంటెడ్. ఆయనలో మంచి డ్యాన్సర్ కూడా ఉన్నారు. గతంలో అనిల్ దర్శకత్వంలో వచ్చిన ఎఫ్-3లో స్పెషల్ సాంగ్లో స్టెప్పులు వేసి అలరించారు.
నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించిన 'భగవంత్ కేసరి' షూటింగ్ సెట్స్లో అనిల్ ఓ రేంజ్లో అల్లరి చేశాడు. ఫైటర్లు, డ్యాన్స్ మాస్టర్లతో కలిసి బాలయ్య పాటకు స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మీరు హీరో కాబోయి పొరపాటున డైరెక్టర్ అయ్యారని.. మీరు మంచి డైరెక్టరే కాదు, మంచి డ్యాన్సర్ అంటూ నెటిజన్లు అనిల్ రావిపూడిపై ప్రశంసల వర్షం కురిపించారు.

తాజాగా తన డ్యాన్సింగ్ స్కిల్స్ను ప్రదర్శించారు అనిల్. ఆదివారం రాత్రి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో '' డైరెక్టర్స్ డే ''వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి తన డ్యాన్స్తో కట్టిపడేశారు. విక్టరీ వెంకటేష్-దివ్యభారతి జంటగా తెరకెక్కిన బొబ్బిలి రాజా సినిమాలోని ''బలపం పట్టి భామ ఒళ్లో'' పాటకు ఆయన స్టెప్పులు వేశారు. ముఖ్యంగా వెంకటేష్ సిగ్నేచర్ స్టెప్స్ను అద్భుతంగా అనుకరించి శెభాష్ అనిపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలయ్యతో భగవంత్ కేసరితో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ప్రస్తుతం.. మరో అగ్రకథానాయకుడు వెంకటేష్తో ఓ సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కలయికలో ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు తెరకెక్కి బ్లాక్బస్టర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ హ్యాట్రిక్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా భీమ్స్ సిసిరోలియో వ్యవహరించనున్నారు. ఈ క్రేజీ కాంబోలో వస్తున్న ఈ మూవీకి వెంకటేష్కు 76వ చిత్రం కావడం గమనార్హం. జూన్ మొదటివారంలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్తుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. అనిల్ మార్క్ కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి ముగిసిన సంగతి తెలిసిందే. వెంకటేష్ రెండో కుమార్తె హయ వాహిని-డాక్టర్ నిశాంత్ వివాహం ఘనంగా జరిగింది. అంతేకాదు.. లోక్సభ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెంకటేష్ ప్రచారం కూడా నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్కు, ఏపీలో బీజేపీకి వెంకీ మద్ధతు పలికారు. ఏలూరు జిల్లా కైకలూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్ధి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తరపున వెంకటేష్ ప్రచారం నిర్వహించారు. కామినేనిని గెలిపించాలని.. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అందరూ ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించాలని వెంకటేష్ సూచించారు. అటు లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన తన వియ్యంకుడు రామసహాయం రఘురాం రెడ్డి తరపున వెంకటేష్ ప్రచారం చేశారు.


Click it and Unblock the Notifications











