నన్ను కొందరూ కావాలని టార్గెట్ చేస్తున్నారు.. అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..
Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు పరాజయం ఎరుగని దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. రచయితగా సినీప్రస్థానం ప్రారంభించిన ఆయన, దర్శకుడిగా మారిన తర్వాత వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 'పటాస్' నుంచి ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' వరకు మొత్తం ఎనిమిది సినిమాలు తెరకెక్కించి, ఎనిమిది విజయాలను ఖాతాలో వేసుకున్నారు. చిన్న హీరోలతో మొదలుకుని స్టార్ హీరోల వరకూ అందరితో సినిమాలు చేస్తూ, బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ జర్నీని కొనసాగిస్తున్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం'తో భారీ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి, ఆ విజయోత్సాహంతో మెగాస్టార్ చిరంజీవి గారితో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అనిల్ రావిపూడి. ఈ సందర్భంగా చిరంజీవి సినిమా గురించి, తనపై వచ్చిన ట్రోల్స్, నెగెటివిటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మొదటగా చిరంజీవి లుక్ గురించి స్పందించిన అనిల్ రావిపూడి, ఈ సినిమా కోసం చిరు 'సాల్ట్ అండ్ పెప్పర్' లుక్ ట్రై చేయాలని అనుకున్నారని, కానీ తానే నో చెప్పినట్లు వెల్లడించారు. బయట ఎలా ఉంటారో సినిమాలో కూడా అలానే చూపిద్దామని చిరంజీవికి చెప్పినట్లు తెలిపారు. 25 ఏళ్ల క్రితం చిరంజీవి ఎంత స్లిమ్గా, స్టైలిష్గా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారని ప్రశంసించారు. మెగాస్టార్ ఎనర్జీ, కమిట్మెంట్ చూసి తాను ఆశ్చర్యపోయినట్లు చెప్పారు.
ఇతర హీరోల విషయానికి వస్తే, గతంలో ఎన్టీఆర్, అల్లు అర్జున్లకు కథలు వినిపించినప్పటికీ అవి వర్కౌట్ కాలేదని తెలిపారు. రవితేజతో 'రాజా ది గ్రేట్' సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉందని కూడా వెల్లడించారు. ఇక చిరంజీవి సినిమాతో పాటు భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా పాజిటివ్గా ఉన్నట్లు చెప్పారు.
'మీరు ఎప్పుడైనా ప్రెషర్ ఫీల్ అవుతారా?' అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రెషర్ తప్పకుండా ఉంటుందని అనిల్ రావిపూడి అన్నారు. ముఖ్యంగా సినిమా రిలీజ్కు ముందు రోజు రాత్రి నిద్ర పట్టదని, అప్పటివరకు ఎంత కూల్గా ఉన్నా ఆ రోజు మాత్రం టెన్షన్ మొదలవుతుందని చెప్పారు. తనకు నచ్చిన కథలు తానే రాసుకుంటూ, వాటిని స్క్రీన్పై ఎలా చూపించాలా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటానని తెలిపారు. అయితే సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉన్నప్పటికీ, ఫలితం చేతిలో ఉండదనే భావనతో ఒత్తిడి ఉంటుందని స్పష్టం చేశారు.
ట్రోలింగ్, నెగెటివిటీపై స్పందిస్తూ.. మొదట్లో అవి తనను చాలా బాధించేవని, కానీ ఇప్పుడు అలవాటైపోయిందని అన్నారు. సంక్రాంతికి వస్తున్నాం, భగవంత్ కేసరి వరకు తనను కావాలనే టార్గెట్ చేసి ట్రోల్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పారు. తాను టచ్ చేసిన జానర్లు, సినిమాల గ్రాస్ కలెక్షన్లు, వరుస బ్లాక్బస్టర్లే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. తాను చేసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ ఆడియన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండరని, అందుకే నెగెటివిటీ ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు.
'నా మీద వచ్చే నెగెటివిటీని నేను ప్రచారంగా భావిస్తాను. వాటినే ప్రమోషన్స్కు వాడుకుంటాను' అంటూ అనిల్ రావిపూడి చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉండగా, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'లో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. హీరో వెంకటేశ్ అతిథి పాత్రలో కనిపించనుండగా, చిరు-వెంకీ కాంబినేషన్ సుమారు 20 నిమిషాల పాటు ప్రేక్షకులను అలరించనుంది. జనవరి 12న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











