ప్రభాస్ క్యారెక్టర్ అలాంటింది.. అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వ్యక్తిత్వం మరోసారి అందరి మనసులను గెలుచుకుంది. స్టార్డమ్, స్థాయి, మార్కెట్... అన్నీ ఉన్నా కూడా వినయంగా మాట్లాడటం డార్లింగ్ ప్రత్యేకత. అందుకే ఆయనను డార్లింగ్ అంటారు కావొచ్చు. అలాగే ఆయన మాట్లాడే తీరు, ఆయన సింప్లీసిటీ, సీనియర్లకు ఇచ్చే గౌరవం... ఇవన్నీ ప్రభాస్ను మిగతా హీరోల కంటే ప్రత్యేకంగా నిలబెడతాయి. ఇప్పటివరకు ప్రభాస్పై ఒక్క వివాదం కూడా లేకపోవడం, ఇండస్ట్రీలో అందరికీ ఇష్టమైన వ్యక్తిగా ఉండటం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. అలాంటి డార్లింగ్ ప్రభాస్ పై తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?
ఇటీవల 'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. 'సీనియర్లు సీనియర్లే... వారి తరువాతే మేము. ముందుగా సీనియర్ హీరోల సినిమాలు ఆడాలి, ఆ తర్వాతే మావి' అంటూ ప్రభాస్ మాట్లాడిన తీరు అభిమానులతో పాటు సినీ వర్గాలను కూడా ఆకట్టుకుంది. సాధారణంగా స్టార్ హీరోలు తమ సినిమా గురించే మాట్లాడే సందర్భాల్లో, ఇలా అందరి సినిమాలు హిట్ కావాలని కోరుకోవడం చాలా అరుదు. అది కూడా పాన్ ఇండియా స్థాయిలో ఉన్న హీరో .. ఇలా మాట్లాడటం మరింత ప్రత్యేకం.

ఈ వ్యాఖ్యలపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ ప్రభాస్ వ్యక్తిత్వాన్ని తెగ ప్రశంసించాడు. 'అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం నిజంగా ప్రభాస్ నేచర్. ఆయన ఉన్న స్థాయికి, స్టేటస్కి సీనియర్స్ తరువాతే మేము అని అనడం హ్యాట్సాఫ్ చెప్పాల్సిన విషయం. ఆయన హ్యూమానిటీ, ఆయన స్వభావమే ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టాయి. అందుకే ఆయనను డార్లింగ్ అంటాం' అంటూ అనిల్ రావిపూడి ప్రశంసలు కురిపించారు. జనవరి 8న 'ది రాజా సాబ్' ప్రీమియర్ షోకి తన టీమ్తో కలిసి వెళ్లి ఆ సినిమాను సెలబ్రేట్ చేస్తామని కూడా చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇక అనిల్ రావిపూడి విషయానికి వస్తే... తెలుగు సినిమా పరిశ్రమలో ఓటమెరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్ గారు' అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తై, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. తన బృందంతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయం బయట మీడియాతో మాట్లాడిన అనిల్ రావిపూడి, 'సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు'ను రిలీజ్ చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి పాడిన పాట చిత్రానికే హైలైట్ అవుతుంది' అని తెలిపారు. అలాగే గుంటూరులో తాను చదివిన కాలేజీలో ఈ పాటను రిలీజ్ చేయబోతున్నామని కూడా చెప్పారు.
ఈ సందర్భంగా మళ్లీ ప్రభాస్ గురించి ప్రస్తావించిన అనిల్ రావిపూడి,'రేపు ఒక పెద్ద ఈవెంట్లో ఈ విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడతాను. ప్రభాస్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ స్థాయిలో ఉండి కూడా సీనియర్లకు ఇచ్చే గౌరవం నిజంగా అభినందనీయం' అని అన్నారు. ఇలా ప్రభాస్ వినయం మరోసారి ఆయనను 'డార్లింగ్'గా నిలబెట్టింది. స్టార్ హీరో అయినా సరే, సీనియర్లకు గౌరవం ఇవ్వడంలో ఎలాంటి తగ్గుదల లేకుండా మాట్లాడటం ఆయన ప్రత్యేకత.
అదే సమయంలో అనిల్ రావిపూడి కూడా తన మాటలతో ప్రభాస్ వ్యక్తిత్వాన్ని మరింత ఎలివేట్ చేశాడు. సంక్రాంతి బరిలోకి దిగబోయే 'ది రాజా సాబ్', 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మరి సంక్రాంతి రేసులో ఈ రెండు సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











