పవన్ కల్యాణ్ సునామీ ముందు .. పని చేయని అల్లు అర్జున్ మ్యాజిక్.. శిల్ప దారుణ ఓటమి!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమి 164 స్థానాల్లో విజయం సాధిస్తే.. వైసీపీ 11 స్థానాల్లో గెలుపొందింది. మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ కీలకనేతలకు సైతం ఓటమి తప్పలేదు. ముఖ్యంగా నంద్యాలలో వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓటమి పాలు కావడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.
సరిగ్గా ఏపీలో ఎన్నికల ప్రచార గడువు ముగియడానికి కొద్దిగంటల ముందు ఈ నియోజవకర్గంలో సినీనటుడు, ఐకాన్స్టార్ అల్లు అర్జున్ పర్యటించారు. తన మిత్రుడు శిల్పా రవికి సంఘీభావం ప్రకటించి, ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని బన్నీ విజ్ఞప్తి చేశారు. కట్ చేస్తే ఎన్నికల ఫలితాల్లో శిల్పా రవి ఓటమి పాలయ్యారు. ఆయనపై టీడీపీ అభ్యర్ధి మహ్మద్ ఫరూఖ్ దాదాపు 11 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పవన్ , మెగా అభిమానులు అల్లు అర్జున్ నాడు నంద్యాలకు వచ్చిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఐకాన్స్టార్గా ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ కొన్ని వివాదాల కారణంగా బన్నీ ప్రతిష్టకు డ్యామేజ్ జరుగుతోంది. సూటిగా సుత్తి లేకుండా చెప్పే తత్వం కారణంగా విమర్శల పాలయ్యారు అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ గతంలో మాదిరిగా కలివిడిగా ఉండటం లేదని.. దీనికి బన్నీ వైఖరే కారణమని సోషల్ మీడియాలో ఏనాటి నుంచో డిస్కషన్ నడుస్తోంది. ముఖ్యంగా 'చెప్పను బ్రదర్ ' ఇష్యూ నుంచి కుటుంబంలో చీలిక వచ్చిందని ఫిలింనగర్ సర్కిల్స్లో చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత రెండు కుటుంబాలు శుభకార్యాల్లో కలిసినా మునుపటిలా బాండింగ్ ఉందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి వేళ ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరనే సంకేతాలను మరోసారి బలంగా పంపింది.
ఎన్నికల ప్రచార గడువు కొద్దిగంటల్లో ముగుస్తుందనగా తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్ధతు పలికేందుకు బన్నీ తన భార్యతో కలిసి నంద్యాలలో దిగారు. శిల్పా రవిని గెలిపించాలని తన అభిమానులను కోరారు. ఇది తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సొంత మేనమామ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కష్టపడుతుంటే ఓ చిన్న ట్వీట్తో సరిపెట్టి.. ఫ్రెండ్ వద్దకు స్వయంగా వెళ్లడాన్ని అది కూడా పవన్ కళ్యాణ్ బద్ధ వ్యతిరేకి వైఎస్ జగన్ పార్టీకి చెందిన వ్యక్తి ఇంటికా అంటూ మెగా, జనసేన అభిమానులు తప్పుబడుతున్నారు.
అయితే నా అన్నవాళ్లు ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తానని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. కానీ ఆయనపై మెగా కాంపౌండ్ గుర్రుగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. '' మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే '' అంటూ ఆయన పోస్ట్ పెట్టాడు. ఇది పరోక్షంగా అల్లు అర్జున్ని ఉద్దేశించినదేనంటూ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఆ తర్వాత నాగబాబు తన ట్వీట్ను డిలీట్ చేశారనుకోండి అది వేరే విషయం.
మెగా ఫ్యామిలీ వల్ల హీరోగా స్టార్డం సంపాదించి ఇప్పుడు ఆ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేయడం ఏంటంటూ మెగాభిమానులు మండిపడుతున్నారు. దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ధీటుగానే బదులిస్తున్నారు. ఇప్పుడు బన్నీ ప్రచారం చేసిన శిల్పా రవి ఓడిపోవడంతో మరోసారి ఐకాన్స్టార్ని మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఛరిష్మా ముందు బన్నీ మ్యాజిక్ పనిచేయలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైనా అల్లు అర్జున్ తన వైఖరిని మార్చుకోవాలని వారు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











