స్టార్ డైరెక్టర్పై కేసు, రంగంలోకి ఏపీ పోలీసులు.. ఏ క్షణమైనా?
సినీ దర్శకుడు , నటుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దాదాపు 15 రోజులుగా జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారం హాట్ హాట్గా ఉండగానే మరో టాలీవుడ్ డైరెక్టర్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరాయన? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఈ వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో ఎంతో మంది స్టార్లుగా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. తమ ప్రతిభను నలుగురికి పరిచయం చేస్తూ డ్యాన్స్, సింగింగ్, నటన ఇలా అన్నింట్లో రాణిస్తూ అవకాశాలు పొందుతున్నారు. ఇంకొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా దూసుకెళ్తున్నారు. వీరికి ఫేమ్తో పాటు మంచి ఆదాయం కూడా వస్తోంది. వీరిని చూసి మరికొందరు ఇటువైపు వస్తున్నారు. ఇక సినీ నటులు, సెలబ్రెటీలకు గతంలో తమ గురించి చెప్పుకోవడానికి సరైన వేదిక ఉండేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా రాకతో ఎంతో మంది స్టార్స్ తమ సినిమాలు, వ్యక్తిగత వివరాలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వారితో టచ్లో ఉంటున్నారు.

మరీ ముఖ్యంగా సెలబ్రెటీలకు ఎప్పుడూ మీడియాలో , వార్తల్లో ఉండాలని ఉంటుంది. ప్రతిరోజూ టీవీలలో కనిపించడం సాధ్యం కాదు కనుక ఇలాంటి వారికి సోషల్ మీడియా ఒక వేదికగా మారింది. అయితే కొందరు వీటిని దుర్వినియోగం చేయడంతో పాటు సంచలన పోస్ట్లతో కలకలం రేపుతున్నారు. పబ్లిసిటీ కోసం నిరాధారమైన వార్తలు, విషయాలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంలోనే చిక్కుకున్నారు సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ.
అప్పెడెప్పుడో నరేష్ హీరోగా వచ్చిన కోకిల సినిమాను తీసిన ఈయన ఆ తర్వాత రేసులో వెనుకబడిపోయాడు. దీంతో యాక్టింగ్ స్కూల్ పెట్టుకుని కొత్త తరానికి దర్శకత్వం, యాక్టింగ్లో శిక్షణ ఇస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానెల్స్ సీనియర్ నటులు, దర్శకుల్ని వేటాడి , వెంటాడి పట్టుకుంటూ వారితో డిస్కషన్స్, ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. అలా గీతాకృష్ణను కూడా పలు ఛానెల్స్ ఇంటర్వ్యూ చేస్తూ సమాచారాన్ని , అనుభవాలను తెలుసుకుంటున్నాయి. అయితే ఈయన సినీ పరిశ్రమలోని గత సంఘటనలను పక్కనే ఉండి చూసినట్లుగా చెబుతూ అసభ్యకర పదజాలంతో దూషించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

ఈయన మాటలకు వెరైటీ థంబ్స్ పెట్టి యూట్యూబ్ ఛానెల్స్ కూడా క్యాష్ చేసుకోవడంతో గీతాకృష్ణకు డిమాండ్ పెరిగింది. అయితే కొందరు నటీనటులు ముఖ్యంగా హీరోయిన్ల గురించి గీతాకృష్ణ హద్దులు దాటి మాట్లాడటంతో విశాఖపట్నంలోని ఉమెన్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సీరియస్ అయ్యారు. వెంటనే ఈ సంస్థ ప్రతినిధులు నగర పోలీస్ కమీషనర్ శంకబ్రత బాగ్చీని కలిసి గీతాకృష్ణపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీపీ.. గీతాకృష్ణపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది.


Click it and Unblock the Notifications











