A R Rahman: ‘ఎవరినీ బాధపెట్టాలన్న ఉద్దేశం లేదు'.. వివాదంపై ఏఆర్ రెహమాన్ క్లారిటీ
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ( A.R. Rahman). ఆయన ఇటీవల చేసిన తాజా వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో గత ఎనిమిదేళ్లుగా తనకు అవకాశాలు తగ్గడానికి 'పవర్ షిఫ్ట్'తో పాటు కొన్ని 'కమ్యూనల్ ప్రభావాలు' కూడా కారణమై ఉండొచ్చని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలను కొందరు తీవ్రంగా విమర్శించగా, మరికొందరు ఇండస్ట్రీలో వాస్తవ పరిస్థితులపై చర్చనీయంగా మారాయి. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో వివాదానికి దారి తీసింది.
ఈ వివాదంపై ఏఆర్ రెహమాన్ తాజాగా స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసిన ఆయన, తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరినీ బాధపెట్టాలన్న ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. 'కొన్ని సందర్భాల్లో ఒకరి ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నా వ్యాఖ్యలతో ఎవరికైనా నొప్పి కలిగితే అది నా లక్ష్యం కాదు. నా నిజాయతీని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను' అని ఆయన పేర్కొన్నారు.

అలాగే, తన మాటల ఉద్దేశం పూర్తిగా వేరే అని వివరించారు.'నా వ్యాఖ్యలు మతంతో ముడిపెట్టి చూడడం సరైంది కాదు. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే. ఒకప్పుడు సంగీతానికి, కళాకారులకు ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు తగ్గుతోంది. కమర్షియల్ అంశాలే ఎక్కువ అవుతున్నాయి. కళ, సంగీతానికి ఇవ్వాల్సిన గౌరవం తగ్గిపోతోందన్న బాధతోనే నేను మాట్లాడాను' అని తెలిపారు. 'నేను ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. కళ, సంగీతం, దేశం పట్ల నా ప్రేమ ఎప్పటికీ మారదు.
ఆ వీడియోలో రెహమాన్ భారత్పై తన ప్రేమను భావోద్వేగంగా వ్యక్తం చేశారు. 'భారత్ నాకు స్ఫూర్తి, గురువు, ఇల్లు. భారతీయుడిగా ఉండటం నేను అదృష్టంగా భావిస్తాను. నా భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి, విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన కళాకారులతో కలిసి పనిచేయడానికి ఈ దేశమే అవకాశం ఇచ్చింది. సంగీతం నా కోసం ఎప్పుడూ దేశ సంస్కృతిని అనుసంధానించే, గౌరవించే, వేడుకగా చేసుకునే ఒక మార్గం' అని చెప్పారు.
అలాగే, తాను బాలీవుడ్కు దూరంగా ఉన్నానన్న అభిప్రాయాల మధ్య కూడా భారత సంగీత రంగానికి నిరంతరం సేవలందిస్తున్నానని రెహమాన్ గుర్తుచేశారు. ఇటీవల జరిగిన WAVES సమిట్లో ప్రధాని మోదీ ఎదుట ప్రదర్శించిన 'ఝాలా' సంగీత ప్రదర్శన, యువ, కొత్త తరానికి చెందిన సంగీతకారులతో కలిసి పనిచేయడం, సన్షైన్ ఆర్కెస్ట్రా ద్వారా చిన్నారులకు సంగీత విద్య అందించడం వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. అంతేకాదు, దేశంలోనే తొలి మల్టీకల్చరల్ వర్చువల్ బ్యాండ్ అయిన 'సీక్రెట్ మౌంటెన్'ను ప్రారంభించడం, హాలీవుడ్ సంగీత దిగ్గజం హాన్స్ జిమ్మర్తో కలిసి ప్రతిష్ఠాత్మక 'రామాయణం' సినిమా కోసం సంగీతం అందించడం వంటి ప్రాజెక్టులు తన ప్రయాణంలో కీలకమైనవని తెలిపారు.
ఇదిలా ఉండగా.. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది అనే విషయాన్ని పరిశీలిస్తే.. రెహమాన్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'బాలీవుడ్లో తమిళ్ లేదా మహారాష్ట్రేతరులపై పక్షపాతం ఉందా?' అనే ప్రశ్నకు స్పందించారు. వ్యక్తిగతంగా తానెప్పుడూ నేరుగా వివక్షను ఎదుర్కోలేదని చెబుతూనే, 'గత ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో పవర్ షిఫ్ట్ జరిగింది. సృజనాత్మకత లేని వారు కూడా కీలక స్థానాల్లో ఉన్నారు. దీనికి మతపరమైన అంశం ఓ కారణమై ఉండొచ్చు. అది నాకు నేరుగా ఎదురుకాలేదు కానీ గుసగుసలు మాత్రం వినిపించాయి' అని వ్యాఖ్యానించారు. అలాగే, 'నేను పని కోసం వెతకను. చిత్తశుద్ధి ఉంటే పనే మన వద్దకు వస్తుంది' అని చెప్పడం మరింత చర్చకు దారి తీసింది.
ఈ వ్యాఖ్యల తర్వాత బాలీవుడ్, ఎంటర్టైన్మెంట్ వర్గాల్లో భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు రెహమాన్ మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ 'కమ్యూనల్ ప్రభావాలు' అన్న పదాన్ని ప్రశ్నించగా, మరికొందరు మాత్రం పరిశ్రమలో అవకాశాలపై ఓ లోతైన చర్చ అవసరమని అభిప్రాయపడ్డారు. అభిమానులు కూడా సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా విడిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఇలా బాలీవుడ్పై చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన వివాదానికి రెహమాన్ ఇచ్చిన వివరణతో కొంతవరకు స్పష్టత వచ్చినట్టే కనిపిస్తోంది. తన లక్ష్యం ఎప్పుడూ సంగీతం ద్వారా దేశాన్ని కలిపే ప్రయత్నమేనని, ఎవరినీ బాధపెట్టడం కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈ వీడియో విడుదలైన తర్వాత ఈ వివాదానికి తెరపడుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











