మరోసారి స్నేహితుడికి ఛాన్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!
హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న బిగ్ బడ్జెట్ యాక్షన్ మూవీ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ అనంతరం మళ్ళీ ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు మాత్రం మామూలుగా పెరగలేదు. ప్రస్తుతం పవన్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్, క్రిష్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవన్ 28వ సినిమా పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. దర్శకుడు ఇప్పటికే ఫుల్ స్టోరీని రెడీ చేసుకున్నాడు. ఇక బలమైన టీమ్ ను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే పవన్ కు అత్యంత సన్నిహితులలో ఒకరైన ఆర్ట్ డైరెక్టర్ ఈ సినిమాకి వర్క్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆయన మరెవరో కాదు ఆనంద్ సాయి. ఆనంద్ సాయి పవన్ కెరీర్ మొదటి నుంచి ట్రావెల్ అవుతున్న క్లోజ్ ఫ్రెండ్ కూడా.

తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి, జల్సా.. వంటి సినిమాలకు కళా దర్శకుడిగా పని చేసిన 'ఆనంద్ సాయి' మళ్ళీ చాలా కాలం తరువాత ఇండస్ట్రీలోకి వచ్చారు. పలు సినిమాలతో రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు అందుకున్న ఆయన గత ఐదు సంవత్సరాలకు పైగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చీఫ్ ఆర్కిటెక్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు.
ఇక ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవటంతో తిరిగి కళాదర్శకునిగా సినిమాలతో బిజీ కానున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో ప్రతిష్ఠాత్మకంగా, భారీ స్థాయిలో, భారీ వ్యయంతో నిర్మించనున్న చిత్రానికి కళా దర్శకునిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇక సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తేవాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేసుకుంటోంది.


Click it and Unblock the Notifications











