Asha Bhosle Net Worth: మూగబోయిన గాన కోకిల.. ఆశా భోస్లే ఆస్తులు ఎన్ని వందల కోట్లంటే ?
Asha Bhosle Net Worth: భారతీయస్వర సామ్రాజ్యం శోకసంద్రంలో ముగిపోయింది. లెజెండరీ గాయని ఆశా భోస్లే (Asha Bhosle) కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా ఛాతీ ఇన్ఫెక్షన్, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న కన్నుమూశారు. ఈ మరణవార్త తెలియగానే సినీ, సంగీత రంగాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. కోట్లాది మంది అభిమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మరో విధంగా.. ఆమె మరణం ఓ స్వర శకానికి ముగింపు లాంటిదే.
ఆశా భోస్లే సంగీత ప్రయాణం అసాధారణం. 1933లో మహారాష్ట్రలో జన్మించిన ఆమె, కేవలం చిన్న వయసులోనే గాన ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1943లో ప్రారంభమైన ఆమె కెరీర్ దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు కొనసాగింది. ఈ కాలంలో ఆమె 12,000కు పైగా పాటలు పాడి ప్రపంచ రికార్డు సృష్టించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయనిగా ఆమె పేరు నిలిచింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ, మలయాళం వంటి దాదాపు 20 భాషల్లో ఆమె పాటలు పాడింది.

ప్రారంభంలో ఆమెకు సవాళ్లు తక్కువగా లేవు. అక్కగా ఉన్న లతా మంగేష్కర్ (Lata Mangeshkar) ఇప్పటికే సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఆశా భోస్లే ఎన్నో కష్టాలు పడ్డారు. 1950లలో ఒక పాటకు లతా మంగేష్కర్ రూ.500 తీసుకుంటే, ఆశాకు కేవలం రూ.100-150 మాత్రమే పారితోషికం దక్కేదని అప్పటి పరిస్థితులు చెబుతాయి. అయితే చిన్న అవకాశాలను కూడా సవాల్గా తీసుకుని, ఐటమ్ సాంగ్స్, క్యాబరే నంబర్లు, వెస్ట్రన్ టచ్ ఉన్న పాటలతో ఆమె తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు.
సంగీత దర్శకుడు ఆర్.డి.బర్మన్తో ఆమె చేసిన ప్రయోగాలు సంగీతంలో కొత్త ట్రెండ్ను సెట్ చేశాయి. పియా తూ అబ్ తో ఆజా, ఆజా ఆజా, యే మేరా దిల్ వంటి పాటలు ఆమె కెరీర్లో మైలురాళ్లుగా నిలిచాయి. మొహమ్మద్ రఫీతో కలిసి పాడిన ఎన్నో పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్గా నిలిచాయి. తెలుగు సినిమాల్లో కూడా ఆమె ప్రత్యేక స్థానం సంపాదించారు. మాయాబజార్ నుంచి మెగాస్టార్ సినిమాల వరకు ఆమె స్వరం వినిపించింది. ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆమెను వరించాయి. కానీ అవార్డుల కంటే కూడా ఆమె సంపాదించిన అభిమానమే పెద్ద సంపద.
ఇక ఆశా భోస్లే ఆస్తుల విషయానికి వస్తే.. ఆమె కేవలం గాయని మాత్రమే కాదు, ఒక విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. వివిధ రిపోర్ట్స్ ప్రకారం 2026 నాటికి ఆమె మొత్తం నికర ఆస్తుల విలువ సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.250 కోట్ల మధ్యగా అంచనా వేయబడుతోంది. దశాబ్దాల పాటు సాగిన సింగింగ్ కెరీర్, లైవ్ కాన్సర్ట్స్, ఆల్బమ్స్, ముఖ్యంగా రాయల్టీల ద్వారా ఆమె భారీగా సంపాదించారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆమెకు భారీ పెట్టుబడులు ఉన్నాయి. ముంబైలోని పెడ్డర్ రోడ్లో ఉన్న ప్రభు కుంజ్ అపార్ట్మెంట్ ఆమె ప్రధాన నివాసం. అదేవిధంగా ముంబై, పూణే నగరాల్లో కోట్ల విలువైన ఇళ్లు, ప్రాపర్టీలు ఆమె పేరిట ఉన్నాయి. మొత్తం రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువ రూ.80 నుంచి రూ.100 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా.
సింగింగ్తో పాటు వ్యాపార రంగంలో కూడా ఆశా భోస్లే తన ప్రతిభను చాటుకున్నారు. 2002లో దుబాయ్లో 'Asha's' పేరుతో రెస్టారెంట్ ప్రారంభించి హాస్పిటాలిటీ రంగంలో అడుగుపెట్టారు. ఈ బ్రాండ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. దుబాయ్, అబుదాబి, కువైట్, బహ్రెయిన్, దోహా వంటి గల్ఫ్ దేశాలతో పాటు యూకేలోని బర్మింగ్హామ్, మాంచెస్టర్ నగరాల్లో కూడా ఆమె రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 14 అవుట్లెట్లు ఈ బ్రాండ్కు ఉన్నట్లు సమాచారం.
వ్యక్తిగత జీవితంలో ఆశా భోస్లే ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. రెండు వివాహాలు, కుటుంబంలో జరిగిన విషాద సంఘటనలు ఆమెను మానసికంగా కృంగదీసినా, సంగీతాన్ని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు.ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబంతో పాటు కోట్లాది అభిమానులను దుఃఖంలో ముంచెత్తుతూ ఆమె ఈ లోకాన్ని విడిచిపోయారు. ఆశా భోస్లే నిజమైన సంపద ఆమె ఆస్తులు కాదు.. ఆమె పాడిన వేల పాటలే. తరతరాలకు మారుమోగే ఆమె గాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె స్వరం మాత్రం ఎప్పటికీ సంగీత ప్రేమికుల హృదయాల్లో నిలిచిపోతుంది.


Click it and Unblock the Notifications




















