Asha Bhosle Death: ఆశా భోస్లే కన్నుమూత... తిరిగిరాని లోకాలకు లెజెండరీ సింగర్
లెజెండరీ సింగర్ ఆశా భోస్లే ఇక లేరు. ఆమె వయసు 92 సంవత్సరాలు. దివంగత గాయని, భారతరత్న లతా మంగేష్కర్కు ఆమె స్వయానా చెల్లెలు. శనివారం సాయంత్రం ఆమెకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆశాను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో అత్యవసర వైద్య సేవలతో ఆశాను కాపాడేందుకు డాక్టర్ ప్రతీత్ సమ్దానీ బృందం శాయశక్తులా ప్రయత్నించింది. అయితే ఆశా శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో ఆమె కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఆశా భోస్లే మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది.

ఆశా భోస్లే ప్రస్థానం
సెప్టెంబర్ 8, 1933న మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు ఆశా భోస్లే. తల్లిదండ్రులు పండిట్ దీనానాథ్ మంగేష్కర్, సేవంతి దీనానాథ్. ఆశాకు అక్క లతా మంగేష్కర్, చెల్లెళ్లు మీనా ఖాడికర్, ఉసా మంగేష్కర్, తమ్ముడు హృదయ్నాథ్ మంగేష్కర్ ఉన్నారు. ఆశాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు తండ్రి దీనానాథ్ మరణించడంతో వీరి కుటుంబం పూణే నుంచి కొల్హాపూర్కు, అక్కడి నుంచి ముంబైకి మకాం మార్చింది. అక్క లతతో కలిసి పాటలు పాడటం, సినిమాలలో సపోర్టింగ్ రోల్స్తో కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చింది ఆశా.
సినీ నేపథ్య గానంతో పాటు పాప్, గజల్స్, భజనలు, కీర్తనలు, భారతీయ శాస్త్రీయ సంగీతం, జానపద పాటలు, ఖవ్వాలీలు, రబీంద్ర సంగీత్లలో ఆశా భోస్లే దిట్ట. హిందీ సహా మొత్తం 20 భాషలలో ఆమె పాటలు ఆలపించారు. 75 ఏళ్లకు పైగా సాగిన కెరీర్లో 800కు పైగా చిత్రాలలో దాదాపు 12 వేలకు పైగా చిత్రాలలో ఆశా భోస్లే ఆలపించారు. ఓపీ నయ్యర్, ఖయ్యం, రవి, సచిన్ దేవ్ బర్మన్, రాహుల్ దేవ్ బర్మన్, బప్పీ లహిరి, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, జైదేవ్, శంకర్- జైకిషణ్, అను మాలిక్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో ఆశా భోస్లే కలిసి పనిచేశారు.
భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో లైవ్ కన్సర్ట్లు నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన నేపథ్య గాయనీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నారు ఆశా భోస్లే. భారతీయ సంగీతానికి చేసిన సేవలకు గాను ఎన్నో అవార్డులను ఆమె అందుకున్నారు. నైటేంగేల్ ఆఫ్ ఆసియా, లతా మంగేష్కర్ అవార్డ్, గ్రామీ అవార్డ్తో పాటు దాదాసాహేబ్ ఫాల్కే, పద్మ విభూషణ్, మహారాష్ట్ర భూషణ్, బంగ బీభూషణ్ పురస్కారాలు ఆమెను వరించాయి. తెలుగులో అన్నమయ్య సంకీర్తనలుతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి కొన్ని చిత్రాలలో పాడారు.
వివాహం- విడాకులు
ఆశకు 16 ఏళ్ల వయసుండగా 31 ఏళ్ల గణపత్రావ్ భోస్లేను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. హేమంత్ భోస్లే, వర్షా భోస్లే, ఆనంద్ భోస్లే ఉన్నారు. అయితే అత్తింటి వేధింపుల కారణంగా పిల్లలను తీసుకుని ఆమె పుట్టింటికి వచ్చేశారు. 1960లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1980లో దిగ్గజ సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్ను పెళ్లాడారు. 1994లో ఆయన చనిపోవడంతో నాటి నుంచి ఒంటరిగానే జీవిస్తున్నారు ఆశా భోస్లే.
బిజినెస్ఉమెన్గా
సంగీతాన్ని ఎంతగా ప్రేమిస్తారో.. వంట చేయడాన్ని అంతే ఇష్టపడతారు ఆశా భోస్లే. ఒకవేళ సింగర్ కాకపోయుంటే మంచి కుక్గా మారేదాన్నని ఆమె పలుమార్లు తెలిపారు. ఆశా చేసే కడాయ్ ఘోస్ట్, బిర్యానీ, పాయా కర్రీ, దాల్ వంటకాలను కపూర్ ఫ్యామిలీ ఇష్టంగా చేయించుకుని తినేది. వారితో పాటు అలనాటి హిందీ సినీ ప్రముఖులకు కూడా ఆశా ఇష్టంగా వండి పెట్టేవారట. వంటలపై ఉన్న ఈ అభిరుచే ఆమెను రెస్టారెంట్ బిజినెస్ వైపు నడిపించింది. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఈజిప్ట్, యూకేలలో ఆశా పేరుతో రెస్టారెంట్స్ ఓపెన్ చేసి విజయవంతంగా నడిపిస్తున్నారు. త్వరలో మరిన్ని దేశాలలో ఈ రెస్టారెంట్స్ ఓపెన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 75 ఏళ్లకు పైగా తన స్వరంతో మూడు తరాల ప్రేక్షకుల్ని అలరించిన ఈ సంగీత సామ్రాజ్ఞి తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో భారతీయ సంగీతం విషాదంలో కూరుకుపోయింది. పలువురు ప్రముఖులు.. ఆశా భోస్లే మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications


















