అషు రెడ్డి కేసులో మరో ట్విస్ట్.. వివాదంలో వేణు స్వామి!
Ashu Reddy Controversy: బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ సినీనటి అషురెడ్డి (Ashu Reddy) చుట్టూ భారీ వివాదం నెలకొంది. ప్రేమ, పెళ్లి పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసిందన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే ఈ కేసు హాట్ టాపిక్గా మారింది. మరోవైపు.. ఆషురెడ్డి తెలంగాణ హైకోర్టు ఆశ్రయించింది. కేవలం కొన్ని గంటల్లోనే ఆషు రెడ్డి ఆడియో లీక్ కావడంతో కొత్త మలుపు తిరిగింది. ముఖ్యంగా ఈ ఆడియోలో జ్యోతిష్కుడు వేణు స్వామి (Venu Swamy) పేరు రావడం వివాదాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది.
ఎన్ఆర్ఐ ధర్మేంద్ర చేసిన ఫిర్యాదు ప్రకారం.. 2018లో అతనికి అషు రెడ్డి పరిచయం అయింది. ఈ సంబంధం తర్వాత ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళ్లింది. ఈ నమ్మకంతో అషు రెడ్డి అతనితో భారీ మొత్తంలో డబ్బులు తీసుకుందని ఆరోపిస్తున్నారు. దాదాపు రూ. 9.5 కోట్లకు పైగా నగదు తీసుకుని, ఆ డబ్బుతో బంగారం, ఫ్లాట్లు, లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదనంగా ఆమె కుటుంబ సభ్యుల పేరుతో కూడా డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వమంటే బెదిరింపులకు దిగిందని, తప్పుడు కేసులు పెడతానని లేదా ఆత్మహత్య చేస్తానని బెదిరించిందని ధర్మేంద్ర ఆరోపించాడు. దీంతో ఈ కేసును మరింత సీరియస్గా మార్చింది.

లీకైన ఆడియో.. కేసులో బిగ్ ట్విస్ట్
ఈ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియో సంచలనం సృష్టిస్తోంది. వాట్సాప్ ద్వారా ధర్మేంద్రకు పంపినట్లు చెప్పబడుతున్న ఈ వాయిస్ మెసేజ్లో అషు రెడ్డి కొన్ని కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆ ఆడియోలో, "మే నెల వరకు సమయం ఇస్తే కోటిన్నర రూపాయలు ఇస్తాను" అని ఆమె చెప్పినట్లు వినిపిస్తోంది. మిగిలిన డబ్బును తన జీవితం సెటిల్ అయిన తర్వాత ఇస్తానని కూడా చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలతో, ఆమె నిజంగా డబ్బులు తీసుకున్నట్టేనా అన్న అనుమానాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు ఈ ఆడియోనే కేసులో కీలక ఆధారంగా భావిస్తున్నారు.
వేణు స్వామి పేరు ఎందుకు వచ్చింది?
ఈ ఆడియోలో అత్యంత ఆసక్తికర అంశం వేణు స్వామి (Venu Swamy) పేరు ప్రస్తావన. "నీ వైపు నుంచి వేణు స్వామిని తీసుకొస్తావా, లేక ఇంకెవరినైనా తీసుకొస్తావో నీ ఇష్టం" అంటూ అషు మాట్లాడినట్లు తెలుస్తోంది. దీనితో ఈ వివాదంలో వేణు స్వామి పాత్ర ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో అషు రెడ్డి, ధర్మేంద్ర పెళ్లి విషయంలో జాతకాలు చూసిన వ్యక్తి వేణు స్వామినేనన్న ప్రచారం కూడా ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చింది. అంటే ఈ డబ్బుల వ్యవహారం, సంబంధం గురించి ఆయనకు ముందే తెలిసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంపై వేణు స్వామి నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది.
సెటిల్మెంట్ ప్రయత్నం
ఆడియోలో అషు రెడ్డి పెద్దల మధ్య పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించుకుందామని చెప్పినట్లు వినిపిస్తోంది. తన తరఫున ఓ సీరియల్ నటి వస్తారని, ధర్మేంద్ర తనవైపు నుంచి ఎవరినైనా తీసుకురావచ్చని చెప్పడం గమనార్హం. ఇది కేసు కోర్టుకు వెళ్లకముందే సెటిల్ చేసుకోవాలన్న ప్రయత్నంగా కొందరు భావిస్తున్నారు. అయితే బాధితుడు మాత్రం దీనిని మోసం కేసుగా చూస్తూ పూర్తి డబ్బులు తిరిగి కావాలని డిమాండ్ చేస్తున్నాడు. ఆడియోలో అషు రెడ్డి ధర్మేంద్రను హెచ్చరించినట్లు కూడా వినిపిస్తోంది. తన కుటుంబ సభ్యులను ఈ వ్యవహారంలోకి లాగితే రివర్స్ కేసు పెడతానని చెప్పడం, తన అనుమతి లేకుండా ఇంటికి రావద్దని చెప్పడం వంటి మాటలు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి. ఇక ధర్మేంద్ర మాత్రం, "కోట్ల రూపాయలు తీసుకుని ఇప్పుడు కేవలం కోటిన్నరతో సెటిల్ అవుదాం అనడం అన్యాయం" అంటూ స్పందించారు.
హైకోర్టులో కేసు.. న్యాయపోరాటం
ఇప్పటికే ఈ కేసులో పోలీసులు మోసం, కుట్ర వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అషు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి FIR రద్దు చేయాలని కోరింది. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, పోలీసులు తన వెర్షన్ వినకుండా కేసు నమోదు చేశారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. లీకైన ఆడియో నిజమా? ఎడిట్ చేసినదా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో, ఒకవైపు మోసం ఆరోపణలు, మరోవైపు సెటిల్మెంట్ ఆఫర్, ఇప్పుడు వేణు స్వామి పేరు.. ఇలా ప్రతి రోజు కొత్త ట్విస్ట్లు రావడంతో ఈ వివాదం మరింత హీట్ అవుతోంది.


Click it and Unblock the Notifications