Athadu4K Re Release: అతడు మూవీ రీ రిలీజ్.. అప్పుడు మా ఆశలు అలా ఆవిరి.. మురళీ మోహన్
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్స్ బ్యానర్పై దుగ్గిరాల కిషోర్, మురళీమోహన్ నిర్మించిన చిత్రం అతడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2005 సంవత్సరం ఆగస్టు 10వ తేదీన రిలీజైంది. థియేట్రికల్గా, టెలివిజన్ తెరపై అత్యధిక మంది వీక్షించిన పాపలారిటీగా సినిమా నిలిచింది. ఈ చిత్రంలో త్రిషా, సోనుసూద్, ప్రకాశ్ రాజ్, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, నాజర్, సునీల్, ధర్మసుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, సుధా, హేహ తదితరులు నటించారు.
గత రెండు దశాబ్దాల కాలంలో కల్ట్ మూవీగా పేరు సంపాదించిన ఈ చిత్రం మహేష్ పుట్టిన రోజు ఆగస్టు 9వ తేదీన రీ రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్లో నిర్వహించగా, నిర్మాత మురళీ మోహన్, జయభేరి ఆర్ట్స్ ప్రతినిధి ప్రియాంక దుగ్గిరాల,ఎక్సెల్ బ్యానర్ ప్రతినిధి జితేంద్ర గుండపనేని, మహేష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధి అన్వేష్ పాల్గొన్నారు. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా మురళీ మోహన్ ఏం చెప్పారు? ఈ సినిమా సాధించిన ఘనతలు ఏమిటనే వివరాల్లోకి వెళితే..

ఈ సినిమాను సుమారుగా 12 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత డివైడ్ టాక్ సొంతం చేసుకొన్నది. ఈ పుల్ రన్లో 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మహేష్ బాబుకు ఓవర్సీస్లో మార్కెట్ను ఓపెన్ చేసింది. ఈ చిత్రం 205 సెంటర్లలో 50 రోజులు, 38 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఈ చిత్రం హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో ఏకధాటిగా 175 రోజులు ఆడటమే కాకుండా 1.4 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
ఇలాంటి ఘనతలను మురళీ మోహన్ వెల్లడిస్తూ.. ఇందులో నాజర్ పోషించిన పాత్రకి శోభన్ బాబు గారిని అనుకున్నాం. ఆ పాత్ర కోసం ఆయనకు బ్లాంక్ చెక్ను పంపించాం. కానీ శోభన్ బాబు గారు మా ఆఫర్ను తిరస్కరించారు. హీరోగానే అందరికీ గుర్తుండాలి కానీ ఇలా ఇంకో పాత్రలో నన్ను గుర్తు పెట్టుకోకూడదని అన్నారని మురళీ మోహన్ చెప్పారు.
అతడు సినిమా కోసం ఓ ఇంటి సెట్ను వేస్తే అందరూ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. దాదాపు 90 శాతం సీన్లు అదే సెట్లో షూటింగ్ చేశాం. ఆ తరువాత ఆ సెట్ను చాలా మంది వాడుకున్నారు. అయితే ఆ తర్వాత కాలంలో ORR వేయడంతో ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వల్ల ఆ సెట్ వెళ్లిపోయింది. లేదంటే అక్కడే ఓ స్టూడియోను నిర్మించాలనే ఆలోచన, ఆశలు అలా ఆవిరి అయ్యాయి. ఆ తర్వాత స్టూడియో నిర్మాణం ఆలోచన మానుకొన్నాం. ఇక నుంచి మా బ్యానర్లో సినిమాలు తీస్తాం. మా బ్యానర్ నుంచి మా సోదరుడి కూతురు ప్రియాంక సినిమాలను నిర్మిస్తుంది అని అన్నారు.

నా సోదరుడు కిషోర్ తనయ ప్రియాంక ఈ మూవీని టెక్నికల్గా అప్ గ్రేడ్ చేసి అందరి ముందుకు తీసుకు వస్తున్నారు. అతడు రీ రిలీజ్ బ్లాక్ బస్టర్ అవుతుందని కచ్చితంగా నమ్ముతున్నాను. ప్రసాద్ ఐమాక్స్ బిగ్ స్క్రీన్ మీదకు సినిమాను తీసుకు రావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం. అప్పట్లో సెన్సార్ వాళ్లు అతడు మూవీని చూసి ఇంగ్లీష్ సినిమాలా ఉందని అన్నారు. కానీ థియేట్రికల్ పరంగా మేం అనుకున్నంత రేంజ్లో ఆడలేదు. కానీ బుల్లితెరపై మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది. కమర్షియల్గా ఈ సినిమాపట్ల మేం సంతృప్తిగానే ఉన్నాం. మేం తీసిన అన్ని చిత్రాలు ఒకెత్తు.. 'అతడు' ఇంకో ఎత్తు. అప్పటికే అధునాతన సాంకేతికతో 'అతడు' మూవీని తీశాం. అద్భుతమైన డైలాగ్స్తో త్రివిక్రమ్ అందరినీ మెప్పించారు. అందుకే త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు అయ్యారు అని మురళీ మోహన్ తెలిపారు.


Click it and Unblock the Notifications











