Bahubali Part 3: బాహుబలి 3 అఫీషియల్.. రాజమౌళి సర్ప్రైజ్.. రానా, ప్రభాస్, అనుష్కలతో ..
Bahubali Part 3: భారతీయ సినీచరిత్రలో ఎన్నో రికార్డులు తిరగరాసిన ఫ్రాంచైజీ 'బాహుబలి'. దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ తెలుగు సినిమా స్థాయిని అమాంతం ప్రపంచవ్యాప్తం చేసింది. 2015లో విడుదలైన 'బాహుబలి: ది బిగినింగ్', 2017లో వచ్చిన 'బాహుబలి 2: ది కన్క్లూజన్' ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడమే కాకుండా నయా రికార్డులను క్రియేట్ చేసింది. తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది. ఈ రెండు సినిమాలు సంచలన విజయం సాధించడంతో మూడో భాగంపై అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెరదించుతూ.. 'బాహుబలి 3'పై అధికారిక ప్రకటన రావడం సినీ ప్రపంచంలో హాట్టాపిక్గా మారింది.
'ది టార్చ్బేరర్'తో మళ్లీ బాహుబలి జ్ఞాపకాలు
బాహుబలి ఫ్రాంచైజీకి పదేళ్లు పూర్తైన సందర్భంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ 'బాహుబలి: ది టార్చ్బేరర్' అనే పేరుతో ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించింది. నాలుగు ఎపిసోడ్లుగా తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీలో సినిమా నిర్మాణం వెనుక జరిగిన విశేషాలు, షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్లు, మహిష్మతి సామ్రాజ్యాన్ని తెరపై ఆవిష్కరించడానికి మూవీ యూనిట్ పడిన కష్టాన్ని కండ్లకు కట్టినట్టుగా చూపించారు. ఈ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు పలువురు టెక్నీషియన్లు తమ అనుభవాలను పంచుకున్నారు. సినిమా కోసం కష్టపడిన వారందర్ని చూపించడం ప్రత్యేకంగా మారింది.

డాక్యుమెంటరీలో ముఖ్యంగా ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బాహుబలి పాత్ర కోసం దాదాపు ఐదేళ్లకు పైగా తన కెరీర్ను అంకితం చేసిన తీరు అభిమానులను మరోసారి ఆకట్టుకుంది. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రల్లో ప్రభాస్ నటనను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు. రాజమౌళి విజన్ను నమ్మి అంత భారీ ప్రాజెక్టును నిర్మించిన నిర్మాత శోభు యార్లగడ్డ ధైర్యాన్ని కూడా ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇండియన్ సినిమా స్థాయిని మార్చిన ప్రాజెక్ట్గా బాహుబలి ఎందుకు నిలిచిందో ఈ డాక్యుమెంటరీ మరోసారి గుర్తు చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
డాక్యుమెంటరీ చివర్లో బిగ్ సర్ప్రైజ్
డాక్యుమెంటరీ చివరి భాగంలో అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. రాజమౌళి "బాహుబలి కథ ఇంకా పూర్తిగా ముగియలేదు" అనే సంకేతం ఇవ్వగా, అనంతరం ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి కనిపించిన ప్రత్యేక వీడియోలో 'బాహుబలి 3' ప్రస్తావన వచ్చింది. వీడియోలో రానా సరదాగా "రాజమౌళి సార్ లేకపోయినా ఈ విషయం చెప్పేస్తున్నా" అంటూ పార్ట్-3 గురించి చెప్పడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. ఆ తర్వాత స్క్రీన్పై ది లెగసీ కంటిన్యూ (The Legacy Continues) అని కనిపించడంతో బాహుబలి ప్రపంచం మరోసారి కొనసాగబోతోందనే సంకేతం వచ్చినట్టు అయింది.
బాహుబలి పార్ట్ 3 కథ ఎలా ఉండొచ్చు?
బాహుబలి-2లో ప్రధాన కథ ముగిసినప్పటికీ, మహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన ఎన్నో కథలు ఇంకా మిగిలే ఉన్నాయి. అమరేంద్ర బాహుబలి పరిపాలన, మహేంద్ర బాహుబలి రాజ్యపాలన, శివగామి పాత్రకు సంబంధించిన మరిన్ని కథలు లేదా పూర్తిగా కొత్త కథతో మూడో భాగాన్ని రూపొందించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి గతంలో కూడా బాహుబలి ప్రపంచంలో ఇంకా చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయని పలు ఇంటర్వ్యూల్లో పేర్కొనడం విశేషం. అందుకే ఇప్పుడు పార్ట్-3 ప్రకటన రావడంతో ఆ కథ ఏ దిశగా సాగుతుందనే ఆసక్తి నెలకొంది.
రాజమౌళి షెడ్యూల్ ఎలా ఉంది?
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో భారీ అడ్వెంచర్ వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే బాహుబలి-3 పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కొందరు 'వారణాసి' ప్రాజెక్ట్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంచనా వేస్తున్నారు. అయితే పార్ట్-3 షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? కథ ఎలా ఉంటుంది? అనే అంశాలపై మూవీ మేకర్స్ నుంచి పూర్తి వివరాలు రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications




