చేతులెత్తి నమస్కరిస్తున్నా.. నాకు ఆ ఉద్దేశం లేదంటున్న బండ్ల గణేష్
టాలీవుడ్లో సంచలనాలకు, వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచే పేరు బండ్ల గణేష్ (Bandla Ganesh). నిర్మాతగా, నటుడుగా, రాజకీయ నాయకుడిగా ఏ రంగంలో ఉన్నా తన మాటలతో, తన ఎనర్జీతో అందరి దృష్టిని ఆకర్షించడంలో బండ్ల గణేష్ ఎప్పుడూ ముందుంటారు. ఈ మధ్య కాలంలో ఈవెంట్స్ షోలలో, సక్సెస్ మీట్ ల్లో పాల్గొంటూ తన వ్యాఖ్యలతో అందరి నోళ్లలో నానుతున్నారు. అలా.. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ ఓ సంచలన ట్విట్ చేసి వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఏమన్నారంటే?
బండ్ల గణేష్ టాలీవుడ్లో తనకంటూ ఓ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న నిర్మాత. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, 'ఇద్దరమ్మాయిలతో, బాద్షా, టెంపర్' వంటి భారీ సినిమాలు నిర్మించి తన స్థాయి చూపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ బ్లాక్బస్టర్ విజయంతో బండ్ల గణేష్ పేరు పరిశ్రమ అంతటా గట్టిగా మార్మోగింది. ఆయన నిర్మించిన సినిమాలు కేవలం కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాదు, ప్రొడక్షన్ విలువల్లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి.

అయితే టెంపర్ తర్వాత బండ్ల కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండి తనదైన స్టైల్లో రియాక్షన్లు, కామెంట్లు చేస్తూ ఫ్యాన్స్తో కనెక్ట్గా ఉన్నారు. సినిమా ఈవెంట్లకు హాజరైనప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్లు, డైలాగులు, స్పీచ్లు తరచుగా వైరల్ అవుతుంటాయి. అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా "సీన్స్ క్రియేట్ చేస్తారు" అని అభిమానులు సరదాగా అంటుంటారు.
ఇటీవల జరిగిన లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్లో బండ్ల గణేష్ చేసిన ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వేడుకలో ఆయన సినిమా ఇండస్ట్రీ, అభిమానులు, మరియు తన వ్యక్తిగత జీవితంపై హృదయపూర్వకంగా మాట్లాడారు. ఆ వీడియోకు లక్షల వ్యూస్ వచ్చాయి. ఆ ప్రభావం ఇంకా తగ్గకముందే,ఇటీవల కే ర్యాంప్ సక్సెస్ మీట్లో ఆయన మళ్లీ మైక్ పట్టారు.
ఈసారి "ఒకప్పుడు నా దగ్గర సినిమాలు అడిగినవాళ్లు, ఇప్పుడు పెద్ద హీరోలయ్యారు" అని ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత మందికి సూటిగా, మరికొంత మందికి సింబాలిక్గా అనిపించాయి. ఆయన మాట్లాడిన టోన్, వ్యాఖ్యల తీరును బట్టి ఆ కామెంట్స్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసినవని అనేక మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. సోషల్ మీడియాలోపెద్ద ప్రచారం మొదలైంది. అదే సమయంలో ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారన్న వార్తలు కూడా గాలిలో ఎగిరాయి. ఈ రెండు రూమర్స్ టాలీవుడ్ చర్చల్లో హాట్టాపిక్గా మారాయి. కానీ ఈ ఊహాగానాలన్నింటికీ స్వయంగా బండ్ల గణేష్ ఫుల్స్టాప్ పెట్టారు.
తాజాగా తన ఎక్స్ (X/Twitter) అకౌంట్లో బండ్ల గణేష్ ఒక ట్వీట్ షేర్ చేస్తూ స్పష్టం చేశారు. "మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం: ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు. ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. దయచేసి తప్పుడు వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో ఉండాలి. చేతులెత్తి నమస్కరిస్తూ కోరుకుంటున్నాను." అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ఒక్కటే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అభిమానులు ఆయన నిజాయితీని ప్రశంసిస్తుండగా, కొందరు "ఇది రీఎంట్రీకు ముందు కూల్ డౌన్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఆయన అభిమానులు మాత్రం "గణేష్ అన్నా గ్యాప్ ఎంతైనా సరే.. మీరు తిరిగి సినిమాల్లోకి రావాలి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











