ప్రకాష్ రాజ్.. అసలు నువ్వెవడివి? నీ అడ్రస్ ఏంటి? నిప్పులు చెరిగిన బండ్ల గణేష్
సినీనటుడు ప్రకాష్ రాజ్.. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తల నుంచి ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్పై మరోసారి ప్రకాశ్ రాజ్ విమర్శలు చేయడంతో నిర్మాత, సినీ నటుడు బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో సభ నిర్వహించాలని అనుకున్నారు. రాయదుర్గలోని సంధ్య కన్వెన్షన్ వేదికగా జూన్ 2న తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ- జనసేన సాధక్ సమ్మేళనం పేరిట ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ సభకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. దానిపై పవన్ కళ్యాణ్ సైతం అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ నడిబొడ్డున జనసేన పుట్టింది.. హైదరాబాద్ నడిబొడ్డున పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణలో లక్షమంది జన సైనికులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనకు, సంస్కృతికి జనసేన పార్టీ వ్యతిరేకం కాదని పవన్ తేల్చిచెప్పారు. ఏపీలో తన వారాహి యాత్రకు అనుమతి ఇవ్వకపోతే.. తెలంగాణలో పర్మిషన్ ఇచ్చారని కోదాడ, నల్గొండ ప్రజలు అండగా నిలిచారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని, తానే తెలంగాణలో తిరుగుతాను, ఇకపై జనసేన పార్టీ ఇక్కడ కూడా పోటీ చేస్తుందని పవన్ స్పష్టం చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తదితర పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర .. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
ప్రకాశ్ రాజ్ ట్వీట్పై జనసేన అభిమానులు, కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వీరాభిమాని, నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఎక్స్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ప్రకాశ్ రాజ్.. నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావ్. నీకు నువ్వే గొప్ప మేధావిని, గొప్ప వీరుడిని అని సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు, కానీ ప్రజలు ఇచ్చే తీర్పే అసలైన సర్టిఫికేట్. నీ సొంత రాష్ట్రంలో, నీ సొంత ప్రజల మధ్య నిలబడి ప్రజల మద్దతు సంపాదించలేని నువ్వు, రాష్ట్ర స్థాయి నాయకులను, దేశ స్థాయి నాయకులను, దేశ ప్రధానులు సైతం గౌరవించే నాయకులను విమర్శించే స్థాయిలో ఉన్నానని అనుకోవడం హాస్యాస్పదంగా ఉంది అంటూ బండ్ల ఫైర్ అయ్యారు.
ప్రతి విషయానికీ 'జస్ట్ ఆస్కింగ్' అని చెప్పడం చాలా సులువు. కానీ ప్రశ్నించే ముందు నీకు నువ్వు కొన్ని ప్రశ్నలు వేసుకో. నీ ప్రయాణం ఏంటి? నీ సాధించినది ఏంటి? సమాజం కోసం నువ్వు చేసినది ఏంటి? ప్రజలు నీ వెనుక ఎందుకు నిలబడాలి? అనే ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పుకోమంటూ ఎద్దేవా చేశారు
ఇతరుల గురించి తీర్పులు ఇవ్వడం కంటే ముందు అద్దం ముందు నిలబడి నీ ఆత్మసాక్షిని అడుగు. నీ చరిత్ర ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ నైతిక హక్కు ఏంటి అని ప్రశ్నించుకో. ఎందుకంటే ప్రజలు మాటలు కాదు, వ్యక్తిత్వాన్ని నమ్ముతారు. విమర్శలు కాదు, విశ్వసనీయతను గౌరవిస్తారు. ఆ రోజు నీకు అర్థమవుతుంది-ఎత్తైన పర్వతాలను చూసి రాళ్లు విసరడం వల్ల ఎవరి స్థాయి పెరగదు అంటూ కౌంటరిచ్చారు.
ఆ వెంటనే ప్రకాశ్రాజ్పై మరో ట్వీట్ చేశారు బండ్ల గణేష్. నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధాని వా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్ అంటూ ఘాటుగా బదులిచ్చారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్ వైరల్ అవుతుండగా.. దీనికి ప్రకాశ్ రాజ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications



