Bangalore Stampede: విరాట్ కోహ్లిని అరెస్ట్ చేయాలి.. బాధితుల్ని పట్టించుకోకుండా అనుష్కతో లండన్ పరారీ
ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి దాదాపు 18 ఏళ్లుగా ఆ మెగా ట్రోఫీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. కెప్టెన్లు, ఆటగాళ్లు, కోచ్లు ఎంతోమంది మారినా ఈ జట్టు కథ మాత్రం మారడం లేదు. అయితే ఈ ఐపీఎల్లో మాత్రం ఈ జట్టు సర్వశక్తులు ఒడ్డింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఈ సాలా కప్ నమదే అన్న నినాదాలతో ఆర్సీబీ ఆటగాళ్లు పోరాడారు. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను 6 పరుగుల తేడాతో ఓడించి ఐపీఎల్ విజేతగా నిలిచింది బెంగళూరు. ఈ విజయంతో విరాట్ కోహ్లీ భావోద్వేగంతో చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. కప్తో స్టేడియమంతా తిరిగి అభిమానులను అలరించాడు.
ఆర్సీబీ సంబరాల్లో తొక్కిసలాట
బెంగళూరు జట్టు 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ కప్ సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ జట్టు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ట్రోఫీతో ఎయిర్పోర్ట్కు వచ్చిన ఆ జట్టుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా నేరుగా విధాన సౌధకు ఆర్సీబీ జట్టు చేరుకుంది. లక్షలాది మంది అభిమానులు తమ ఛాంపియన్లను చూసేందుకు తరలిరావడంతో విధానసౌధ పరిసర ప్రాంతాలు, బెంగళూరు రోడ్లు మాత్రం జనసంద్రంగా మారాయి. అయితే దురదృష్టవశాత్తూ ఈ తాకిడిని పోలీసులు నియంత్రించలేకపోవడం, సమన్వయ లోపం, పుకార్లతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 మంది వరకు గాయపడ్డారు.

తొక్కిసలాటపై సీఎం సిద్ధరామయ్య సీరియస్
తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం రూ.10 లక్షల ఎగ్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దర్యాప్తు కోసం కమిటీని నియమించారు. బెంగళూరు పోలీస్ కమీషనర్తో పాటు తొక్కిసలాటకు బాధ్యులుగా ఉన్న ఇతర పోలీస్ ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే రాయల్ ఛాలెంజర్స్ జట్టు ప్రతినిధులు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, డీఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధులను తక్షణమే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించారు.
కోహ్లీని ఏకీపారేస్తోన్న నెటిజన్లు
అయితే ఇంతటి విషాదం చోటు చేసుకున్నపటికీ చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవాలు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీని నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్యాబిడ్డలతో కలిసి లండన్ వెళ్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండటమే దీనికి కారణం. ఓ వైపు తొక్కిసలాటలో ఆత్మీయులను కోల్పోయి బాధిత కుటుంబాలు పుట్టెడు దు:ఖంలో ఉంటే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి కోహ్లీకి మనసెలా వచ్చిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
కోహ్లీని అరెస్ట్ చేయండి
ఈ క్రమంలో ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఐపీఎల్తో పాటు క్రికెట్ ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించిన విరాట్ కోహ్లీ.. బాధిత కుటుంబాలకు వ్యక్తిగతంగా ఎలాంటి ఆర్ధిక సాయం చేయలేదని అతను మండిపడ్డారు. సాయం చేయకపోయినా కనీసం ఒక్క బాధిత కుటుంబాన్ని కూడా కలవలేదని, చిన్న ట్వీట్ చేసి లండన్ చెక్కేశాడని ఫైర్ అయ్యాడు. విరాట్ కోహ్లీ అత్యంత నీచుడని, ఇలాంటి క్రికెటర్ని ఎప్పుడూ చూడలేదని తొక్కిసలాట ఘటనలో విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలంటూ అతను డిమాండ్ చేస్తున్నాడు. అలాగే #ArrestKohli అనే ట్వీట్ను ట్రెండ్ చేయాలంటూ నెటిజన్లను డిమాండ్ చేశాడు.


Click it and Unblock the Notifications











