Bangladesh Protests: బంగ్లాలో సినీ నిర్మాత దారుణ హత్య.. హీరోని వెంటాడి కొట్టి చంపిన జనం!
ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్ను రణరంగంలా మార్చేసి చివరికి ఆ దేశ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడం వరకు వెళ్లింది. ఆమె ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు కల్పించిన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్ధులు, నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కుదించినా నిరసనలు కొనసాగాయి. బంగ్లాదేశ్ను హసీనా వీడిని తర్వాత ఆమె అధికారిక నివాసంలో నిరసనకారులు రెచ్చిపోయారు. ప్రధాని ఇంట్లోకి చోరబడి విలువైన వస్తువులు లూటీ చేయడంతో పాటు హసీనా తండ్రి, మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. రాజకీయ శరణార్ధిగా హసీనా యూకే ప్రభుత్వాన్ని కోరారు.. అప్పటి వరకు ఆమె భారత్లోనే ఆశ్రయం పొందనున్నారు.
మరోవైపు పార్లమెంట్ను రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ మంగళవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో సర్కార్ కొలువుదీరనుంది. అనంతరం కొద్దినెలల్లోనే మళ్లీ ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికే త్రివిధ దళాల అధిపతులు, పలు రాజకీయ పార్టీల నేతలు, విద్యార్ధి సంఘాల నేతలతో అధ్యక్షుడు చర్చలు జరిపారు. ఆందోళనల కారణంగా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిని విడుదల చేసేందుకు అధ్యక్ష కార్యాలయం అనుమతించింది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఛైర్పర్సన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కూడా జైలు నుంచి విడుదలయ్యారు.
షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయినప్పటికి బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. గడిచిన 21 రోజులుగా జరుగుతున్న ఆందోళనల కారణంగా మరణించిన వారి సంఖ్య 440కి చేరిందని అంచనా. పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం, పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జషోర్ జిల్లాలో అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్కు చెందిన ఓ హోటల్కు అల్లరి మూకలు నిప్పు పెట్టడంతో 24 మంది సజీవ దహనమయ్యారు. అయితే ఆందోళనల ముసుగులో ఇతర మతాలకు చెందిన వారిని టార్గెట్ చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలో ఓ హీరోని , అతని తండ్రిని ఆందోళనకారులు దారుణంగా కొట్టి చంపారు. లక్ష్మీపూర్ మోడల్ యూనియన్ పరిషత్ ఛైర్మన్ సలీం ఖాన్, ఆయన కుమారు శాంతో ఖాన్ను అల్లరి మూకలు చంపేశాయి. హింసాత్మక పరిస్ధితుల నేపథ్యంలో తండ్రీ, కొడుకులిద్దరూ బలియా యూనియన్లోని ఫరక్కాబాద్ మార్కెట్లో జనం వారిని చుట్టుముట్టారు. అక్కడ తుపాకీతో కాల్పులు జరిపి తప్పించుకున్నా బగారా మార్కెట్లో వీరిద్దరిని అడ్డుకున్న జనం సలీం, శాంటోలను కొట్టి చంపారు.
సలీం.. షెహన్షా, భిరోధి వంటి సినిమాలను నిర్మించారు. స్వయంగా తుంగీ ప్యార్ మియా భాయ్ అనే సినిమాను నిర్మించి దర్శకత్వం కూడా వహించారు. తన కొడుకు శాంతో ఖాన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసి నిలదొక్కుకునేలా చేస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటన బెంగాలీ, బంగ్లా చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది.


Click it and Unblock the Notifications











