Lata Mangeshkar: రెండు రోజుల సంతాప దినాలు.. ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు.. ఎప్పుడు, ఎక్కడంటే?
స్వర కోకిల భారతరత్న లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఫిబ్రవరి 6 ఆదివారం ఉదయం 8:12 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. ఇక ఆమె అంత్యక్రియలు ఎప్పుడు? ఎక్కడ? జరగనున్నాయి. అనే వివరాలలోకి వెళితే...

నెల రోజులుగా
92 సంవత్సరాల వయసులో లతా మంగేష్కర్ గత నెల రోజులుగా COVID-19 తో పోరాడుతున్నారు. అయితే ఆమెకు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆమె ఆదివారం ఉదయం సమయంలో తుది శ్వాస విడిచారు. అంతకుముందు, లతకు చికిత్స చేసిన బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రతితా సమదానీ, న్యుమోనియా మరియు కరోనా తర్వాత ఆమె మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా మరణించిందని చెప్పారు. ఆమె శరీరంలోని చాలా భాగాలు పనిచేయడం మానేశాయని డాక్టర్ వెల్లడించారు.

సంతాపాన్ని తెలియజేస్తూ
స్వర కోకిల మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తూ ఉండగా రెండు రోజుల జాతీయ సంతాప దినాలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లతా మంగేష్కర్ మృతి పట్ల దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా రాజకీయ, సంగీత, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ రంగాలకు సంబంధించిన ప్రముఖులంతా తమ సంతాపాన్ని తెలియజేస్తూ నివాళులర్పించారు.

36 ప్రాంతీయ చిత్రాలలో
లతా మంగేష్కర్ 1000 కంటే ఎక్కువ హిందీ చిత్రాలలో, 36 ప్రాంతీయ చిత్రాలలో పాటలు పాడారు. మొత్తం మీద, లతా మంగేష్కర్ 5, 000 కంటే ఎక్కువ పాటలకు తన గాత్రాన్ని అందించారు. ఆమె గిన్నీస్ లో కూడా తన పేరును రికార్డ్ చేసుకున్నారు. మధుబాల నుండి ఐశ్వర్యరాయ్ వరకు లతా మంగేష్కర్ తన గాత్రాన్ని అందించారు. భారతరత్నతో పాటు పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సహా పలు జాతీయ చలనచిత్ర అవార్డులతో లతా మంగేష్కర్ సత్కరించబడ్డారు.

మోదీ సంతాపం
ప్రధాని మోదీ అయితే తన ట్వీట్లో 'నా బాధ మాటల్లో చెప్పలేనిది. దయ గల లతా దీదీ మమ్మల్ని విడిచిపెట్టారు. ఆమె మన దేశంలో ఎప్పటికీ పూరించలేని శూన్యాన్ని మిగిల్చింది. తన మధురమైన స్వరంతో ప్రజలను మంత్రముగ్ధులను చేసే అసమానమైన సామర్థ్యం కలిగిన ఆమెను భారతీయ సంస్కృతికి పట్టం కట్టిన వ్యక్తిగా రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి' అని పేర్కొన్నారు.

శివాజీ పార్క్లో
ఆదివారం సాయంత్రం పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లతా మంగేష్కర్ మరణం తర్వాత, ఆమె మృతదేహాన్ని మధ్యాహ్నం 12:30 గంటలకు ఆమె ఇంటికి తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత శివాజీ పార్క్లో సాయంత్రం 6:30 గంటలకు లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ప్రభుత్వ లాంఛనాలతో
లతా మంగేష్కర్కు భారత దేశ అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న లభించింది, కాబట్టి ఆమె అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఆమె అంత్యక్రియలను అన్ని దేశీ న్యూస్ ఛానళ్లు లైవ్ లో అందించనున్నాయి. రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించడంతో దేశంలో అన్ని వినోద కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











