'భీమ్లా నాయక్' రిలీజ్ ఏపీ సీఎం చేతిలో.. నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్లు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల ఎప్పుడు అని అడిగిన రిపోర్టర్ లకు ఆ సినిమా నిర్మాత నాగ వంశీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు.. ఆ వివరాల్లోకి వెళితే

ప్రెస్ మీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భీమ్లా నాయక్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రానా కీలక పాత్రలో నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే- మాటలు అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

డిజే టిల్లు ప్రెస్ మీట్
అయితే తాజాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపొందిన డిజే టిల్లు అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా ఈ ప్రెస్ మీట్ లో భీమ్లా నాయక్ సినిమా విడుదలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. భీమ్లా నాయక్ సినిమా ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన స్పందించారు.

అనుమతించినప్పుడు సినిమా రిలీజ్
మొన్న పోస్టర్లో 25 ఫిబ్రవరి కానీ ఏప్రిల్ 1 విడుదల చేస్తున్నామని చెప్పాము కదా ఇప్పుడు మీరు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన తీసివేసి ఎప్పుడు 100% ఆక్యుపెన్సీతో షో లు వేసుకో వచ్చు అని అనుమతించినప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

కుదరని పక్షంలో
ఫిబ్రవరి 25 లోపు ఆ నిబంధనలు ఎత్తివేసే అవకాశం ఉందని తాము భావిస్తున్నామని ఒకవేళ కుదరని పక్షంలో ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం అనే సినిమాను తెలుగులో భీమ్లా నాయక్ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో మలయాళంలో బిజు మీనన్ పోషించిన పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తూ ఉండగా అక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రను దగ్గుబాటి రానా పోషిస్తున్నారు.

భారీ అంచనాలు
ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి అందుకే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా RRR కారణంగా వాయిదా పడింది కానీ RRR కూడా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ఎప్పటికి రిలీజ్ అవుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











