Bheemla Nayak వైఎస్ జగన్ కక్ష సాధింపు వద్దు.. పవన్ కల్యాణ్ను ఏమీ చేయలేవు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాపై, ఏపీలో థియేటర్లపై ఆంక్షలు విధించడంపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక ప్రదర్శనలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్పై కక్ష సాధింపు చర్యలు మానుకొంటే మీకు మంచిది. లేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని అన్నారు. ఫిబ్రవరి 25వ తేదీన భీమ్లా నాయక్ చిత్రం రిలీజ్ అవుతున్న సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..

పవన్ కల్యాణ్పై కక్ష సాధింపు వద్దు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై, ఆయన నటించిన భీమ్లా నాయక్ మూవీపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదు అని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్పై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఆయనకు ఏమీ కాదు అని అన్నారు. పేదలకు, మధ్య తరగతి వర్గాలకు వినోదాన్ని దూరం చేస్తున్నావు. అంత ఈగో పనికి రాదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇలానే సినిమా పరిశ్రమపై కక్ష సాధిస్తే.. ఏ డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు ఆంధ్రప్రదేశ్లో షూటింగులు చేయరు. ఇకనైనా పవన్ కల్యాణ్పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి అని జేసీ ప్రభాకర్ రెడ్డి హితవు పలికారు.

భీమ్లా నాయక్ ప్రభంజనాన్ని ఆపలేవు
భీమ్లా నాయక్ రిలీజ్ నేపథ్యంలో సినిమా థియేటర్లపై ఆంక్షలు విధిస్తే.. పవన్ కల్యాణ్కు ఏమౌతుంది. ఆయనను ఏమీ చేయలేవు. ఏపీలో కలెక్షన్లు తగ్గుతాయేమో.. కానీ భీమ్లా నాయక్ ప్రభంజనాన్ని ఆపలేవు. ఇంకా పవన్ కల్యాణ్ క్రేజ్ను పెంచుతున్నావు. ఏపీలో కాకపోతే తెలంగాణలో కలెక్షన్ల కుంభవృష్టి కురుస్తుంది. హైదరాబాద్ బ్రహ్మండంగా బాగుపడుతుంది. దక్షిణాది సినిమానే కాదు.. బాలీవుడ్ సినిమా పరిశ్రమ కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నది అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

18 శాతం ట్యాక్స్. ఓట్లు కోల్పోతావు..
భీమ్లా నాయక్ సినిమాపై ఆంక్షలు విధించడం కారణంగా 18 శాతం ట్యాక్స్ కోల్పోయావు. కేవలం ట్యాక్స్ మాత్రమే కాదు.. ఓట్ల శాతాన్ని కూడా కోల్పోతావు. నీ క్యాబినెట్లో కూడా ఆ కులం వాళ్లు ఉన్నారు. వాళ్లు మీ మీ వెంట ఉంటారని భ్రమ పడకు. ఇప్పుడంటే మీకు అధికారం ఉంది కాబట్టి మీతో ఉంటున్నారు. ఆ అధికారం పోతుందని తెలిసిన రోజు మీతో ఎవరుంటారో ఆలోచించుకోండి. మీ క్యాబినెట్లో గౌతమ్ రెడ్డి లాంటి ఒక మంత్రి మంచిగా ఉండేవారు. అతడు కూడా ఈ లోకాన్ని వీడారు. ఇక నీ మంత్రివర్గంలో మిగిలింది కేవలం బూతులు మాట్లాడేవారు అని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులా?
భీమ్లా నాయక్ సినిమాపై, పవన్ కల్యాణ్పై కక్ష సాధింపు మానుకోండి. మీ ప్రవర్తన, విధానాల వల్ల ఏమీ జరుగదు. పరువు పోగొట్టుకోవడం తప్ప. మీకు వ్యతిరేకంగా మాట్లాడితే.. వారిని టార్గెట్ చేయడం, అరెస్ట్ చేయించడం సరికాదు. నీ బాబాయ్ హత్య కేసులో సీబీఐ అధికారులపై కూడా కేసు పెడుతున్నావు. ఇది సరైనదా అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించాడు.

స్వయంగా ఎదిగిన వాళ్లు ఏమీ చేయలేవు..
సినిమా ప్రముఖులంతా స్వయంగా ఎదిగిన వాళ్లు. తేనే మనసులు సినిమాలో కృష్ణ పక్కన చిన్న పాత్ర వేశాను. అప్పుడు ఆయన సామాన్యమైన వ్యక్తి. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి సూపర్ స్టార్ అయ్యారు. ఇక చిరంజీవి కూడా అంతే.. ఆయన తండ్రి ఎవరు? సామాన్యమైన కానిస్టేబుల్. ఆయన కొడుకు చిరంజీవి ఈ రోజు సినిమా పరిశ్రమలోనే టాప్ యాక్టర్. స్వయంగా ఎదిగిన వాళ్లను ఏమీ చేయలేవు అని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.


Click it and Unblock the Notifications











