కాంగ్రెస్ వల్లే నేను నలుగురు పిల్లల్ని కన్నాను.. బీజేపీ ఎంపీ, టాలీవుడ్ విలన్ వివాదాస్పద వ్యాఖ్యలు
దేశంలో జనాభాను నియంత్రించేందుకు నరేంద్ర మోదీ చర్యలు చేపట్టింది. దేశంలో పెరిగిపోతున్న జనాభాకు అడ్డుకట్ట వేసేందుకు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టడం వెనుక ఆసక్తికరమైన చర్చతోపాటు విమర్శలు, ప్రతి విమర్శలు జోరుగా మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే రేసు గుర్రం మూవీ ఫేమ్, నటుడు, తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలతో ప్రేక్షకుల మెప్పు పొందిన బీజేపీ ఎంపీ రవి కిషన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మీడియాలో వివాదాస్పదంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

ఆజ్ తక్ ఎజెండా చర్చలో
దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఆజ్ తక్ ఎజెండా అనే పేరుతో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎజెండా ఆజ్ తక్ 2022 కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు పాల్గొన్నారు. అయితే ఓ చర్చ కార్యక్రమంలో భోజ్పురికి చెందిన సినీ నటులు, ఎంపీలు మనోజ్ తివారీ, రవి కిషన్ తదితరులు పాల్గన్నారు. ఈ సందర్భంగా జనాభా నియంత్రణ చట్టం బిల్లుకు సంబంధించిన చర్చ జరిగింది.

మీరు నలుగురు పిల్లల్ని కన్నారుగా...
ఆజ్ తక్ ఎజెండా చర్చలో న్యూస్ యాంకర్ మాట్లాడుతూ.. పార్లమెంట్లో జనాభా నియంత్రణ బిల్లు ప్రవేశపెట్టి చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో రవికిషన్, మనోజ్ తివారీని ఉద్దేశించి.. మీ సంతానం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. రవి కిషన్కు నలుగురు సంతానం. మనోజ్ తివారీ మీకు మూడో సంతానం త్వరలోనే కలుగనున్నది. అందుకు ధన్యవాదాలు. మీ సంతానం గురించి అందరు ప్రశ్నిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏమిటి? అని ప్రశ్నించారు.

పార్లమెంట్కు వెళ్లి బిల్లు ప్రవేశపెడుతా
జనాభా నియంత్రణ బిల్లు చట్టం కోసం అంతా రెడీగా ఉంది. ప్లార్లమెంట్లో ప్రవేశ పెడుతున్నాం. కానీ మీకు ముందస్తు సమాచారం ప్రకారం.. ఈ వార్తను మీరు మా ముందు లీక్ చేశారు. జర్నలిస్టుగా మీ ప్రతిభకు సలాం. మీరు నన్ను వదిలిపెడితే.. పార్లమెంట్కు వెళ్లి బిల్లు ప్రవేశపెడుతాను. మీరు అన్నట్టే నేను నలుగురు పిల్లలకు సంతానం ఇచ్చాను. తండ్రిగా నా బాధ్యతలను ఎప్పుడూ గుర్తు పెట్టుకొంటాను అని ఎంపీ, నటుడు రవికిషన్ అన్నారు.

సినిమా పరిశ్రమలో చాలా కష్టాలు పడ్డా
సినిమా పరిశ్రమలో నా కెరీర్ ఆరంభంలో చాలా కష్టాలు పడ్డాను. దాదాపు 15 ఏళ్లపాటు డబ్బు కోసం కాకుండా అవకాశాల కోసమే నటించాను. చాలా మంది ఆఫర్ కావాలా? డబ్బు కావాలా? అంటే చేయడానికి పని కావాలని డబ్బు గురించి పట్టించుకోలేదు. చాలా మంది నాతో యాక్టింగ్ చేయించుకొని డబ్బులు ఇవ్వలేదు. అవకాశాలు వస్తే.. డబ్బు వాటంతంట అదే వస్తుందని నేను అనుకొనే వాడిని. అలాంటి పరిస్థితుల మధ్య నాకు సంతానం కలిగింది అని రవికిషన్ అన్నారు.

ప్రెగ్నెన్సీ సమయంలో నా భార్య పరిస్థితి చూసి..
కెరీర్ సజావుగా సాగని సమయంలోనే నా భార్య తొలి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె పొడువుగా.. బక్క పలచగా ఉండేది. తొలి కాన్పు తర్వాత ఆమె శరీరం పాడవ్వడం చూశాను. అలాంటి పరిస్థితుల్లోనే రెండో కాన్పు జరిగింది. నా మెదడు సరిగా పనిచేయకపోయేది. ఏం చేయాలో తెలిసేది కాదు.. షూటింగులు, పనితో బిజీగా ఉండేవాడిని. అలా మూడో, నాలుగో బిడ్డ కూడా పుట్టేశాడు. ఆ తర్వాత సక్సెస్ వచ్చింది. దాంతో నాకు మెచ్యురిటీ వచ్చింది. అప్పుడు ఆమెను చూస్తే.. చాలా బాధవేసేది. నేను చాలా సార్లు సారీ చెప్పాను అని రవికిషన్ ఎమోషనల్ అయ్యాడు.

కాంగ్రెస్ పార్టీ బిల్లు తెచ్చి ఉంటే..
అయితే ఆజ్ తక్ న్యూస్ యాంకర్ మాట్లాడుతూ.. నీవు మాత్రం నలుగురు పిల్లల్ని కన్నావు.. ఇతరులను ఎక్కువ మంది కననివ్వకుండా అడ్డుపడుతున్నావు అని అంటే.. కాంగ్రెస్ పార్టీ జనాభా నియంత్రణ బిల్లు తెచ్చి ఉంటే.. నేను నలుగురు పిల్లల్ని కనేవాడినే కాదేమో. ఒకరో, ఇద్దరో పిల్లలతో ఆగిపోయేవాడినేమో అని రవికిషన్ అన్నాడు. దాంతో నీవు పిల్లలు కనడానికి కారణం, నేరం కూడా కాంగ్రెస్ పార్టీ మీద వేస్తావా? అని యాంకర్ అనడం గమనార్హం.
నీకు కండోమ్స్ ఉన్నాయనే విషయం తెలియదా?
బీజేపీ ఎంపీ రవికిషన్ వ్యాఖ్యలపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. నీవు ఎప్పుడైనా కండోమ్స్ గురించి విన్నావా? ఈ పెద్ద మనిషి నాలుగుసార్లు భార్యకు కడుపు చేశాడు. నాకు ఇప్పుడు మానసిక పరిణితి కలిగింది.. అప్పుడు ఇలా చేయకుండా ఉండాల్సిందని భార్య దేహం గురించి బాధపడుతున్నాడు. నలుగురు సంతానం కనడానికి కాంగ్రెస్ కారణం అంటూ బద్నాం చేస్తున్నాడు. ఇందంతా చాలా ఫన్నీగా ఉంది కదా అని కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











