65 ఏళ్లకు పైబడిన నటులు, నిపుణులు పనిచేయొద్దా? బాంబే హైకోర్టు ఆగ్రహం
కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో సినీ పరిశ్రమలో 65 ఏళ్లకు మించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయకూడదని నిషేధం విధించడంపై సరైన వివరణ ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఇటీవల సినిమా షూటింగుల కోసం అనుమతులు ఇస్తూ.. అందులో 65 ఏళ్ల వయసు పైబడిన వాళ్లు పనిచేయకూడదు అని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
మహారాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను నటుడు ప్రమోద్ పాండే సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో జూలై 21న పిటిషన్ దాఖలు చేశారు. చాలా మంది సీనియర్ నటులు నటనపైనే ఆధారపడి బతుకుతున్నారు. అలాంటి వారు పనిచేయకుండా ఆంక్షలు విధిస్తే వారి పరిస్థితి ఏమిటి అని పాండే తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాండే పిటిషన్ను విచారించిన కోర్టు వివరణ ఇవ్వాలని మహా సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.

మహారాష్ట్ర జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. 10 ఏళ్లకు లోబడి పిల్లలను, 65 ఏళ్లు దాటిన పెద్ద వారిని షూటింగుల్లో పాల్గొన వద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. సీనియర్ నటులు, సాంకేతిక నిపుణులు పనిచేయకపోతే వారి ఆర్థిక పరిస్థితి సంగతి ఏమిటి? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారి జీవనం గడిచేది ఎలా అంటూ కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. శుక్రవారంలోపు ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వాలని విచారణను జూలై 24వ తేదీకి వాయిదా వేసింది.


Click it and Unblock the Notifications











