Akhanda 2: హిమాలయాల్లో అఖండ 2.. బోయపాటి ఏం చేస్తున్నారంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీనులది హిట్ కాంభినేషన్ . వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. ముఖ్యంగా అఖండ మూవీ బాలయ్య కెరీర్లోనే సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ సమయంలో కరోనా భయంతో జనాలు థియేటర్కు రావడానికే భయపడ్డారు. ఈ దశలో మళ్లీ థియేటర్లు కళకళలాడేలా చేశారు బాలకృష్ణ. అలాంటి ఘన విజయం సాధించిన అఖండకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు.
బాలకృష్ణ తన కెరీర్లోనే ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి , భగవంత్ కేసరి లేటెస్ట్గా ఈ సంక్రాంతికి డాకు మహారాజ్తో వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లను అందుకున్నారు బాలయ్య. కాస్త విరామం అనంతరం అఖండ 2 షూటింగ్కి కూడా బాలకృష్ణ కొబ్బరికాయ కొట్టేశారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని ఆయన కూడా మంచి ఉత్సాహంతో ఉన్నారు.

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళాతో అఖండ 2 చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు బోయపాటి శ్రీను. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కుంభమేళాకు ఏర్పాట్లు బాగున్నాయని.. అఘోర నేపథ్యంలో అఖండ 2 ఉంటుందని బోయపాటి చెప్పారు. ఈ ప్రయాణంలో నాగసాధువులను, అఘోరాలను కలిశామని సినిమాను అద్భుతంగా తీసేందుకు శ్రమిస్తున్నామని బోయపాటి శ్రీను వెల్లడించారు.
కుంభమేళాలో షూటింగ్ ముగించిన అనంతరం నెక్ట్స్ షెడ్యూల్ను అంతే వేగంగా ప్లాన్ చేస్తున్నారు బోయపాటి శ్రీను. ఇటీవల హైదరాబాద్లో ఓ కీలక షెడ్యూల్ను పూర్తి చేసుకున్న అఖండ 2 యూనిట్.. కొత్త షెడ్యూల్కు కూడా సిద్ధమవుతోంది. మార్చి 2వ వారం నుంచి హిమాలయాల్లో తదుపరి షెడ్యూల్ ఉండనుందట. హిమాలయ శ్రేణుల్లోని అందమైన లోకేషన్ల కోసం దర్శకుడు బోయపాటి తీవ్రంగా గాలిస్తున్నారట. ఇప్పటికే పలు స్పాట్లను ఆయన ఎంపిక చేసినట్లుగా ఫిలింనగర్ టాక్. హిమాలయాల్లో జరిగే ఈ షెడ్యూల్లో అఖండ పాత్రపై కీలక సన్నివేశాలతో పాటు ఓ భారీ యాక్షన్ సీన్ను చిత్రీకరించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం రామ్ - లక్ష్మణ్ కసరత్తు చేస్తున్నట్లుగా వినికిడి.
14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపీచంద్ అచంట సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య చిన్న కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. బాలయ్య మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దసరా కానుకగా ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. థమన్ స్వరాలు సమకూరుస్తుండగా.. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మిగిలిన క్యాస్టింగ్, టెక్నీషియన్స్ వివరాలు బయటికి రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











