100 కోట్లు వసూలైనా.. నిర్మాత చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Telugu film business: సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా విజయం అంటే ఎన్ని సెంటర్లలో ఆడింది. ఎన్ని రోజులు థియేటర్లలో హౌస్ఫుల్ షోలు చేసిందనే విషయాలే ప్రధాన చర్చగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం లెక్కలు మారాయి. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజునే ఎంత వసూలు చేసిందో, రెండో రోజున ఎంత గ్రాస్ సాధించిందో అనే పోస్టర్లు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. డే 1 రికార్డు, వీకెండ్ కలెక్షన్స్ అంటూ నంబర్స్ వేస్తున్నారు. అయితే.. వాస్తవానికి ఒక సినిమాకి కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి? ఎవరికి ఎంత వెళ్తున్నాయి? అనేది ఎవరికి క్లారిటీ లేదు. అలానే ప్రొడ్యూసర్ కూడా తనకి వచ్చిన లాభాన్ని చెప్పుకోడు. ఒక భారీ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. ఏం జరుగుతుంది? నిర్మాతకు వచ్చే ఆదాయం ఎంత? అనే విషయాలు నిర్మాత బన్నీ వాసు ఇలా వివరించారు.
ఇటీవల ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూలో సినిమా వ్యాపారంలోని వాస్తవాలను బహిర్గతం చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'ఒక సినిమా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసినా, అందులో నిర్మాతకు వచ్చేది కేవలం 39 కోట్లు మాత్రమే' అని తెలిపారు. 'ప్రేక్షకుడు వంద రూపాయల టికెట్ కొంటే ఆ మొత్తం నిర్మాతకు వస్తుందని అనుకుంటారు. కానీ వాస్తవానికి వంద రూపాయల టికెట్లో నుండి జీఎస్టీ, డిస్ట్రిబ్యూషన్ కమిషన్, థియేటర్ ఖర్చులు, ఇతర వ్యయాలు తీసేస్తే నిర్మాతకు మిగిలేది కేవలం 39 రూపాయలే'అని వివరించారు.

ఆ 39 రూపాయలు కూడా నిర్మాత చేతికి రావాలంటే, ఆ సినిమా మాక్సిమమ్గా సూపర్ డూపర్ హిట్ కావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో సినిమా నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న పని అనీ, ఇతర భాషా సినిమాలతో పోటీ పడాలి, గ్లోబల్ మార్కెట్లోకి వెళ్లాలి. అందుకే తక్కువ బడ్జెట్లో సినిమా తీయడం అసాధ్యం అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ విపరీతంగా పెరగడం, టెక్నీషియన్ల వేతనాలు, సీజీ (CG) ఖర్చులు గణనీయంగా పెరగడంతో బడ్జెట్ కంట్రోల్ నిర్మాత చేతులలో ఉండడం కష్టమైందని చెప్పారు. ఇంతకుముందు చిన్న సినిమా సీజీ ఖర్చు 60- 70 లక్షలు మాత్రమే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది'అన్నారు బన్నీ వాసు.
మలయాళ సినిమాలను అతి తక్కువ ఖర్చులో తీస్తున్నారు. మరి మనం ఎందుకు తీయలేకపోతున్నామని ప్రశ్నించగా.. మన దగ్గర కూడా ఇలాంటి సినిమాలు ఉన్నాయి. ఉదాహరణకు లిటిల్ హార్ట్స్ సినిమాను కేవలం రెండున్నర కోట్లలో తీశారు కానీ దాదాపు 35 కోట్లను వసూలు చేసింది. అయితే ప్రతి సినిమా అలా వర్క్ అవుతుందనుకోవడం పొరపాటేనని అన్నారు.
అయితే.. తెలుగు సినిమాలపై ఓటిటీల ప్రభావం కూడా ఎక్కువగా పడిందని ఆయన వ్యాఖ్యానించారు. 'మలయాళంలో హిట్ అయిన తర్వాత సినిమాలు ఓటీటీకి అమ్ముతారు. కానీ మన దగ్గర మాత్రం ఓటీటీ డబ్బులతోనే సినిమాలు తీస్తున్నారు. అందుకే 28 రోజులలో సినిమాలు ఆన్లైన్లోకి వస్తున్నాయి. ఈ కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు తగ్గిపోతున్నారని బన్నీ వాసు స్పష్టంగా చెప్పారు.
గతంలో టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఈ విషయంపై స్పందించారు. సినిమా నిర్మాతలకు కలెక్షన్లలో ఎంత భాగం నిజంగా మిగులుతుందో స్పష్టంగా వివరించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా పెద్దగా వసూలు చేస్తే, ఆ మొత్తం నిర్మాతకు వస్తుందనుకుంటారు. కానీ, ఆ పరిస్థితి పూర్తిగా వాస్తవమని తెలిపారు. దిల్ రాజు వివరించిన లెక్కలు ప్రకారం.. ఒక పెద్ద సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే, మొదట 18 శాతం జీఎస్టీ కింద రూ.36 కోట్లు ప్రభుత్వానికి వెళ్తాయి. ఆ తర్వాత థియేటర్ రెంటల్స్ పేరుతో మరో 25 శాతం అంటే రూ.50 కోట్లు తగ్గుతాయి. అంటే రూ.200 కోట్లలో నిర్మాత చేతికి వచ్చేది ఇప్పుడు రూ.110 కోట్లు మాత్రమే.
అయితే నిర్మాత సినిమా హక్కులు డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే.. మరో 20 శాతం అంటే రూ. 25 కోట్లు డిస్ట్రిబ్యూటర్ లాభంగా వెళ్ళిపోతాయని తెలిపారు. అలా చివరకు నిర్మాత చేతికి మిగిలేది కేవలం రూ.85 కోట్లు మాత్రమేనని చెప్పారు. అంతేకాకుండా, లాభం వస్తే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సుమారు 35 శాతం ఆదాయపన్ను కూడా చెల్లించాల్సి వస్తుందని అన్నారు. అందుకే సినిమా ఇండస్ట్రీలో నిలబడటం అంత తేలిక కాదని వ్యాఖ్యానించారు. చాలామంది రియల్ ఎస్టేట్ వైపు వెళ్లారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా ఇద్దరూ నిర్మాతలు వాస్తవ పరిస్థితిని స్పష్టంగా చూపించాయి. కలెక్షన్లు ఎంత భారీగా కనిపించినా, నిజమైన లాభం నిర్మాత చేతికి మిగిలేది చాలా తక్కువే అన్నది వారి లెక్కలు మరోసారి రుజువు చేశాయి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి.


Click it and Unblock the Notifications











