CCL 2025 : గెలుపు ముందు చతికిలపడ్డ చెన్నై.. సీజన్ తొలి గెలుపు బెంగాల్దే
సినీ , క్రీడా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 (సీసీఎల్ 2025) ఘనంగా ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సీసీఎల్ 2025 ప్రారంభమైంది. తొలిరోజు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం నాలుగు జట్ల మధ్య ఫిబ్రవరి 8వ తేదీ మధ్యాహ్నం తర్వాత వరుసగా రెండు మ్యాచ్లు జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మొత్తం ఏడు రోజుల పాటు ఈ లీగ్ కొనసాగనుంది. ఫస్ట్, సెకండ్ మ్యాచ్లలో తలపడే జట్లకు ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్ ను పూర్తి చేసుకొని వార్ కు సిద్ధమయ్యాయి.
తొలి రోజు జరిగే మ్యాచ్లో చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్.. కర్ణాటక బుల్డోజర్స్, తెలుగు వారియర్స్ తలపడుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు చెన్నై రైనోస్- బెంగాల్ టైగర్స్ మధ్య.. సాయంత్రం 6.30 గంటలకు కర్ణాటక బుల్డోజర్స్- తెలుగు వారియర్స్ బరిలోకి దిగుతున్నాయి. నాలుగు జట్ల ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్లో చెమట చిందించారు. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు, అభిమానులు కూడా బెంగళూరుకు చేరుకుని తమ జట్లను ఉత్సాహపరుస్తున్నారు.

చెన్నై రైనోస్- బెంగాల్ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన బెంగాల్ జట్టు కెప్టెన్ జిషు సేన్ గుప్తా మరో మాట లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జమ్మీ - బోనీలు బెంగాల్ జట్టుకు ఓపెనింగ్ ఆరంభించారు. అయితే చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగాల్కు పరుగులు చేయడం కష్టంగా మారింది. అయినపన్పటికీ జమ్మీ ధాటికి బ్యాటింగ్ చేసి జట్టుకు మంచి స్కోరు అందించాలని ప్రయత్నించాడు. ఈ సీజన్కే తొలి బౌండరీతో పరుగుల ఖాతా తెరిచిన జమ్మీ క్రీజులో ఉన్నంత సేపు విరుచుకుపడ్డాడు.
బెంగాల్ టైగర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ :
ఊపు మీదున్న దశలో శరణ్ ఈ జోడీని విడదీశాడు. 19 పరుగుల వద్ద మూడో ఓవర్ చివరి బంతికి బోనీ (1) భారీ షాట్కు ప్రయత్నించి శరణ్కు రివర్స్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ కాసేపటికే బెంగాల్కు మరో షాక్ తగిలింది కెప్టెన్ జిషు సేన్ గుప్తా 30 పరుగుల వద్ద కేవలం రెండు పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా చెన్నై బౌలర్ల దెబ్బకి బెంగాల్ టైగర్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే ఉంది. భరత్ బౌలింగ్లో 33 పరుగుల వద్ద రాహుల్ భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద విక్రాంత్కు చిక్కాడు.
దీంతో జమ్మీ , యూసఫ్లు ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు . వేగంగా పరుగులు తీస్తూ మధ్య మధ్యలో బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ను గాడిలో పెడుతున్న దశలో జమ్మీ (22) .. 35 పరుగుల వద్ద భారీ షాట్కు ప్రయత్నించి పరికి చిక్కాడు. అనంతరం యూసఫ్ (14), జాయ్ (19)లు ధాటిగా ఆడటంతో బెంగాల్ టైగర్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. చివరిలో భరత్ బౌలింగ్లో జాయ్ భారీ షాట్కు ప్రయత్నించి 5వ వికెట్గా వెనుదిరిగాడు. మొత్తంగా 10 ఓవర్లలో బెంగాల్ టైగర్ 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసి చెన్నై ముందు 80 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై రైనోస్ బౌలర్లలో కలై 2, భరత్, శరణ్లు తలో వికెట్ తీశారు.
చెన్నై రైనోస్ ఫస్ట్ ఇన్నింగ్స్ :
అనంతరం 80 పరుగుల ఆధిక్యమే లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి రమణ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు . ఏకంగా 5 ఫోర్లు, ఒక సిక్సర్తో బెంగాల్ టైగర్స్పై విరుచుకుపడి 28 పరుగులు చేశాడు. ఈ దశలో 8.5 ఓవర్ వద్ద చెన్నై లీడింగ్లోకి వచ్చింది. భారీ సిక్సర్తో జట్టును లీడింగ్లోకి తీసుకొచ్చాడు అజయ్. మొత్తంగా 10 ఓవర్లలో చెన్నై రైనోస్ 90 పరుగులు చేసి బెంగాల్పై 11 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. చెన్నై బ్యాట్స్మెన్లలో రమణ (28) , శరణ్ (20), విక్రాంత్ (4),పృథ్వీ (14), అజయ్ (20) పరుగులు చేశారు. బెంగాల్ బౌలర్లలో రత్నదీప్ 2, ముకుల్ 1 వికెట్ పడగొట్టారు.
బెంగాల్ టైగర్స్ సెకండ్ ఇన్నింగ్స్ :
చెన్నై అందుకున్న 11 పరుగుల ఆధిక్యాన్ని అధిగమించడమే లక్ష్యంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ టైగర్స్ రావడం రావడమే ఎదురుదాడికి దిగింది. బౌలర్ ఎవరైనా సరే ఊచకోత అన్నట్లుగా ఆడిన జిషుసేన్ జట్టు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. మొత్తంగా నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేయడంతో పాటు చెన్నైపై 100 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. బెంగాల్ టైగర్స్లో జాయ్ 30, రాహుల్ 38, ఆనంద 11, జమ్మీ 7, రత్నదీప్ 2, యూసఫ్ 11, జిషుసేన్ గుప్తా 7 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో శరణ్, విక్రాంత్, కలైలు మూడు వికెట్లు పడగొట్టారు.
చెన్నై సెకండ్ ఇన్నింగ్స్ :
101 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది . తొలి ఓవర్ రెండో బంతికే అజయ్ ఔటయ్యాడు. లక్ష్యం భారీగా ఉండటంతో ఒత్తిడికి గురైన ఆ జట్టు వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. చివరిలో దాశరథి, పృథ్వీ, పారిలు ధాటిగా ఆడినా చేతిలో బంతులు అయిపోవడంతో నిర్ణీత 10 ఓవర్లలో చెన్నై రైనోస్ 5 వికెట్లు కోల్పోయి 88 పరుగులు మాత్రమే చేయడంతో బెంగాల్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. అజయ్ 4, విక్రాంత్ 10, శంతను 10, పృథ్వీ 17, పారి 14, దాశరథి 28 పరుగులు చేశారు. బెంగాల్ బౌలర్స్లో ముకుల్ 2, జమ్మీ 2, రత్నదీప్ 1 వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications











