150 కోట్ల బిజినెస్ చేసిన తెలుగు పాట.. ఆ లిరిక్స్లో అంత పవర్ ఉందా?
ప్రపంచ యవనికపై తెలుగు పాటకు పట్టం కట్టేలా చేసిన గేయ రచయిత చంద్రబోస్ (lyricist chandra bose). సాధారణ పదాలతో అసాధారణ భావాలను చెప్పగలిగే ఆయన రచనా శైలి కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను తాకింది. 'నాటు నాటు' పాటతో తెలుగు పాటను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి ఆస్కార్ అందుకున్న చంద్రబోస్, ఇప్పుడు మరో ఆసక్తికర విషయంతో వార్తల్లో నిలిచారు. ఆయన రాసిన ఒక పాట ఓ ఇన్సూరెన్స్ కంపెనీకి ఏకంగా రూ.150 కోట్ల అదనపు వ్యాపారం తెచ్చిందని చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆ పాట ఏంటీ?
సాధారణంగా ఒక సినిమా పాట ప్రేక్షకులను అలరిస్తుంది, కొందరికి భావోద్వేగాన్ని ఇస్తుంది, మరికొందరికి జ్ఞాపకాలుగా మిగిలిపోతుంది. కానీ ఒక పాట ఏకంగా ఒక సంస్థ వ్యాపారాన్ని పెంచడం మాత్రం చాలా అరుదు. అదే అద్భుతం చంద్రబోస్ రాసిన 'బడ్జెట్ పద్మనాభం' సినిమాలోని ఓ పాటతో జరిగింది. "ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే.. బంటు నువ్వే.. మంత్రి నువ్వే.. సైన్యం నువ్వే" అంటూ సాగే ఈ పాట.. మొదట్లో పెద్దగా గుర్తింపు పొందలేదు. కానీ సంవత్సరాల తర్వాత ఈ పాట అనూహ్యంగా వేలాది మందికి మోటివేషన్ సాంగ్గా మారింది.

ఒక సందర్భంలో ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ తమ ఏజెంట్ల కోసం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి చంద్రబోస్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఆ కార్యక్రమంలో ఆయన తన కెరీర్ ప్రయాణం, జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడుతూ, మధ్యలో ఈ పాటను ఆలపించారు. మొదట ఇది సాధారణ కార్యక్రమంగానే కనిపించినా, అక్కడే ఈ పాట ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. కార్యక్రమానికి వచ్చిన కొందరు ఏజెంట్లు ఈ పాటను తమ సెల్ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలా ఆ వీడియో ఒక్కో గ్రూప్ నుంచి మరొక గ్రూప్కు వెళ్తూ వైరల్ అయింది.
ఆ పాటలోని పదాలు సాధారణ ఉద్యోగులు, ముఖ్యంగా టార్గెట్ల కోసం కష్టపడే ఇన్సూరెన్స్ ఏజెంట్లకు భారీ స్థాయిలో ప్రేరణనిచ్చాయి. "నువ్వే రాజు.. నువ్వే సైన్యం" అనే భావం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెబుతున్నారు. ముఖ్యంగా రోజూ తిరస్కారాలు ఎదుర్కొనే సేల్స్ ఉద్యోగులకు ఈ పాట ఒక మానసిక బలంగా మారింది. దీంతో ఆ సంస్థ ఏజెంట్లు మరింత ఉత్సాహంతో పనిచేయడం ప్రారంభించారని, దాని ఫలితంగా కంపెనీకి అదనంగా రూ.150 కోట్ల వ్యాపారం వచ్చిందని స్వయంగా సంస్థ ప్రతినిధులు చంద్రబోస్కు చెప్పారట.
ఈ విషయంపై చంద్రబోస్ మాట్లాడుతూ, "లాభం లేని విషయం అయితే వాళ్లు ఎందుకు చెబుతారు? ఆ పాట వాళ్ల ఏజెంట్లలో జీర్ణించుకుపోయింది. వాళ్లలో పోరాట స్పూర్తిని పెంచింది" అని పేర్కొన్నారు. ఒక పాట కేవలం వినోదం మాత్రమే కాదు.. మనిషి ఆలోచనలను మార్చగల శక్తి కూడా కలిగి ఉంటుందని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.
ఈ పాట వెనుక ఉన్న తన వ్యక్తిగత భావోద్వేగాలను కూడా చంద్రబోస్ పంచుకున్నారు. ఇంజనీరింగ్ చదువుకుంటూ మంచి జీవితం గడపొచ్చని తెలిసినా, తన మనసు మాత్రం సినీ రంగంపైనే ఉందని చెప్పారు. గేయ రచయిత కావాలనే కలతో స్టూడియోల చుట్టూ తిరిగిన రోజులను గుర్తు చేసుకున్నారు. పాలిథిన్ కవర్లో పాటల పుస్తకాలు పెట్టుకుని వెళ్తే, "నువ్వా పాటలు రాసేది?" అంటూ చాలామంది అవమానించేవారని చెప్పారు. "వెళ్లు.. మాకు చాలా మంది రాసేవాళ్లు ఉన్నారు" అంటూ తిరస్కరించారని, ఆ మాటలు తన మనసును బాగా బాధించేవని తెలిపారు.
అయితే ఆ అవమానాలే తనకు బలంగా మారాయని చంద్రబోస్ అన్నారు. "వంద అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ఈ ఇండస్ట్రీ వైపు చూడకూడదని అనుకున్నాను. కానీ 21 అవమానాల తర్వాతే తిరస్కారాలు సన్మానాలుగా మారడం మొదలైంది" అని చెప్పారు. సాధారణ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చి, ఆస్కార్ స్థాయికి ఎదిగారు చంద్రబోస్. RRR సినిమాలోని 'నాటు నాటు' పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ రావడం ద్వారా తెలుగు సినీ చరిత్రలో ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణితో కలిసి ఆయన అందుకున్న ఆ గౌరవం తెలుగు సినీ అభిమానులందరికీ గర్వకారణమైంది.


Click it and Unblock the Notifications




