Singer Chinmayi: అతిథి రేపో భవ... సింగర్ చిన్మయి షాకింగ్ పోస్ట్
నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటారు స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద. తన సినిమా విశేషాలతో పాటు ఇతర అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. చిత్ర పరిశ్రమలో జరిగే ఏ విషయంపై అయినా మాట్లాడుతూ.. ఎంత పెద్ద స్టార్ని అయినా విమర్శించడంలో ముందుంటారు. మీటూ ఉద్యమం నుంచి నిన్న మొన్నటి శివాజీ - అనసూయ వివాదం వరకు చిన్మయి తనదైన వాదన వినిపించారు. తాజాగా ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలో ఓ అమెరికన్ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమెరికాకు చెందిన ఓ పర్యాటకురాలు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే కొడగు జిల్లా కుట్టా గ్రామంలోని ఓ హోమ్ స్టేల్ బస చేశారు. జార్ఖండ్కు చెందిన వృజేష్ కుమార్ అక్కడే పనిచేస్తున్నాడు. ఆమెపై కన్నేసిన వృజేష్.. సదరు విదేశీయురాలిపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని హోమ్ స్టే యజమానికి బాధితురాలు ఫిర్యాదు చేయగా.. ఇతను కూడా వృజేష్కి సహకరించాడు. ఈ విషయం బయటకు రాకుండా.. ఆమె బయటకు రాకుండా చేశాడు.

మూడు రోజుల పాటు హోమ్ స్టేలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశాడు. దానితో పాటు మూడు రోజుల పాటు ఆమెకు మత్తు మందు ఇచ్చి విషయం బయటకు రాకుండా చేశాడు. ఈ క్రమంలో బాధితురాలు తాను మైసూరు వెళ్తానని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది. దీనిపై స్పందించిన యూఎస్ ఎంబసీ అధికారులు మైసూరు పోలీసులకు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మెయిల్ చేశారు. దీనిపై రంగంలోకి దిగిన కర్ణాటక పోలీస్ శాఖ.. కుట్టా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ పరిణామాలు భారత్కు వచ్చే విదేశీయుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా తదితర ప్రాంతాల్లో ఉన్న అందమైన పర్యాటక ప్రదేశాలతో పాటు పురాతన కట్టడాలను చూసేందుకు విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. భారతీయుల ఆతిథ్యం కూడా వారిని ఆకట్టుకోవడంతో తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులతో మనదేశానికి వస్తున్నారు. అయితే ఒంటరిగా వచ్చే విదేశీ మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. గతంలో కేరళలోని కొల్లంలో అమెరికాకు చెందిన మహిళపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. ఇప్పుడు తాజాగా కర్ణాటకలో అమెరికా మహిళపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ క్రమంలోనే ఓ మహిళ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. అతిథి దేవో భవ అనే నినాదానికి ఏమైనా అర్ధం ఉందా అని ఆ నెటిజన్ ట్వీట్ చేయగా.. దానికి స్పందిస్తూ చిన్మయి శ్రీపాద రీపోస్ట్ చేసింది. దీనికి అతిథి రేపో భవ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం చిన్మయి ట్వీట్ వైరల్ అవుతుండగా.. అతిథిని గౌరవించడం భారతీయ సాంప్రదాయమని, అలాంటిది అతిథుల పట్ల ఇలాంటి ఘటనలు సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విదేశీ మహిళపై అఘాయిత్యం చేసిన వ్యక్తిని, ఇతనికి సహకరించిన హోమ్ స్టే ఓనర్ని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications