యువ హీరో చిరాగ్ పాశ్వాన్ తండ్రి, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ కన్నుమూత
బాలీవుడ్ నటుడు, ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్కు తీరని విషాదం ఎదురైంది. ప్రముఖ రాజకీయ నాయకుడు, దళిత నేత, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఢిల్లీలోని ప్రముఖ హాస్పిటల్లో అనారోగ్యంతో మృతి చెందారు. పాశ్వాన్ వయసు 74 సంవత్సరాలు. దీంతో పాశ్వాన్ కుటుంబం పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు.
గత కొద్దికాలంగా రాం విలాస్ పాశ్వాన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అక్టోబర్ 4వ తేదీన ఆయకు హార్ట్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన హాస్పిటల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.

తండ్రి మరణంతో చిరాగ్ పాశ్వాన్ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రిని తలచుకొంంటూ నాన్న.. మీరు లోకం నుంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయినప్పటికీ.. మీరు ఎప్పుడూ నా వెంట ఉంటావని నమ్ముతున్నాను. మిస్ యూ పాపా అంటూ ట్వీట్ చేశారు. చిన్నప్పుడు చిరాగ్ను పాశ్వాన్ ఎత్తుకొన్న ఫొటోను షేర్ చేశారు.
1969లో బీహార్ ఎన్నికల్లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ అభ్యర్తిగా పోటీ చేయడం ద్వారా రాం విలాస్ పాశ్వాన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత లోక్ జనశక్తి పార్టీని స్థాపించారు. 1977 నుంచి వరుసగా ఎంపీగా ఎన్నికైన రికార్డు ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో హాజీపూర్ లోక్సభ నుంచి అత్యధిక ఓట్లతో సుమారు 4.24 లక్షల మెజారిటీతో విజయం సాధించిన రికార్డు పాశ్వాన్ పేరిట ఉంది. యూపీఏ, ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం బీహార్ నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.

ఇక చిరాగ్ పశ్వాన్ విషయానికి వస్తే.. 2011లో మిలే నా మిలే హమ్ చిత్రం ద్వారా బాలీవుడ్లోకి ప్రవేశించారు. ఈ చిత్రంలో కంగన రనౌత్తో కలిసి నటించారు. ఆ తర్వాత తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చారు.


Click it and Unblock the Notifications











