అదే ఆఖరి చూపు అయింది.. రాళ్లపల్లిని గుర్తుచేసుకొని.. చిరంజీవి ఉద్వేగం
సీనియర్ నటుడు రాళ్లపల్లి మృతితో తెలుగు సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని విషాదంలో మునిగిపోయారు. గతకొద్దికాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రాళ్లపల్లి హైదరాబాద్లోని మాదాపూర్లోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తుదిశ్వాస విడిచారు. దాంతో ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.

రాళ్ళపల్లి మృతికి మెగాస్టార్ చిరంజీవి సంతాపం వెల్లడిస్తూ.. చెన్నైలోని వాణి మహల్లో డ్రామాలు వేస్తున్నప్పుడు తొలిసారి రాళ్ళపల్లి గారిని కలిశాను. రంగస్థలం మీద ఆయన నటన చూసి ముగ్ధుడినయ్యాను. ఆయన నటనను ఎంతో అభిమానించే వాడిని. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు. నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. దాంతో ఆయనతో అనుబంధం పెరిగింది. ఎక్కడ కలిసినా నన్ను ఆప్యాయంగా పలకరించేవారు. చక్కని స్నేహశీలి.
చాలా రోజుల తర్వాత ఆ మధ్య 'మా' ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాను. 'ఎలా ఉన్నావు మిత్రమా?' అంటూ ఇద్దరం ఒకరిని ఒకరం పరస్పరం పలకరించుకున్నాం. అదే ఆఖరి చూపు అయ్యింది. ఇంతలో ఆయన తనువు చాలించారంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేసుకుంటున్నాను అని చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు.
తీరని లోటు.. కేఎస్ రామారావు
మా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై రూపొందించిన అభిలాష చిత్రంలో ఎంతో మంచి కారక్టర్ చేసిన రాళ్ళపల్లి గారు మంచి నటుడు, వ్యక్తి. ఆయన లేకపోవడం పరిశ్రమకి తీరని లోటు. రాళ్ళపల్లి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని క్రియేటివ్ కమర్షియల్స్. అధినేత కె ఎస్ రామారావు, అన్నారు.


Click it and Unblock the Notifications