నా మొదటి డ్యాన్స్ ఆయన పాటకే.. నన్ను వెన్నాడే విషాదం: చిరు ఎమోషనల్ ట్వీట్
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజు రోజుకూ ఇది ఉధృతం అవడంతో వేల సంఖ్యలో ప్రజలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. గతంలో పోలిస్తే ఈ సారి ఈ మహమ్మారి ప్రభావం సినిమా రంగంపై ఎక్కువగా చూపిస్తోంది. దీంతో ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ సింగర్ జీ ఆనంద్ కరోనా కారణంగా మరణించారు. కొద్ది రోజులుగా ఈ వ్యాధితో బాధ పడుతోన్న ఆయన.. గత రాత్రి పరిస్థితి విషమించడంతో తుది శ్వాసను విడిచి పెట్టారు. దీంతో దాదాపు నలభై ఏళ్ల ఆయన ప్రస్థానం ముగిసింది.
సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సినిమాలకు పాటలు పాడడంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్గానూ సేవలు అందించిన జీ ఆనంద్ మృతి పట్ల సినీ ప్రముఖులంతా సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీలు ఆయన మరణంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ట్వీట్ చేశారు.

అందులో 'ఎన్నియల్లో... ఎన్నియల్లో... ఎందాకా... అంటూ నా సినీ జీవితంలో తొలి పాటకి గాత్ర దానం చేయడం ద్వారా నాలో ఒక భాగమైన మృదు స్వభావి, చిరు దరహాసి శ్రీ జీ ఆనంద్ గారు కర్కశమైన కరోనా బారిన పడి ఇక లేరు అని నమ్మలేకపోతున్నాను. మొట్ట మొదటి సారి వెండి తెరమీద ఆయన గొంతు పాడిన పాటకే నేను నర్తించాననే విషయం, ఆయనతో నాకు ఒక అనిర్వచనీయమైన, అవినాభావ బంధం ఏర్పరిచింది. ఆయన ప్రస్థానం నన్ను వెంటాడే విషాదం. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా సంతాపం తెలియచేసుకుంటున్నాను' అంటూ రాసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











