Allu Studio opening లాభాపేక్ష కోసం స్టూడియో నిర్మించలేదు.. ఆయన పేరు ఓ బ్రాండ్.. చిరంజీవి ఎమోషనల్
అల్లు అరవింద్ నేతృత్వంలో, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా అల్లు కుటుంబ సభ్యుల కలిసి హైదరాబాద్లో కొత్త ఫిల్మ్ స్టూడియో - అల్లు స్టూడియోస్ను ప్రారంభించారు. అల్లు స్టూడియో ప్రారంభోత్సవ వేడుకలో మెగాస్టార్ చిరంజీవితోపాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..

మా మామ గారు వేసిన బాటలో
శ్రీ అల్లు రామలింగయ్య గారు.. మామ గారి.. శతజయంతి ఉత్సవం సందర్బంగా వారిని స్మరించుకొంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఇది సినిమా పరిశ్రమలో అరుదైన సంఘటన. చాలా కొద్దిమందికే ఇలాంటి ఘనత లభిస్తుంది. దానికి వారి కుమారులు, మనవళ్లు కారణం కావడం ఆనందంగా ఉంది. మా మామగారు వేసిన బాటలో ఆయన కుమారుడు అల్లు అరవింద్ నడవడం, ఆయన మనవళ్లు బన్నీ, శిరీష్, బాబీ సినిమా పరిశ్రమలో కొనసాగుతూ అగ్రస్థానంలో ఉన్నారు అని చిరంజీవి అన్నారు.

పాలకొల్లులో ఆయన మదిలో ఆలోచన
ఎన్నో దశాబ్దాల క్రితం పాలకొల్లులో అల్లు రామలింగయ్య గారి మనసులో మెదిలిన ఆలోచన. మద్రాస్ వెళ్లి నా ఉనికిని చాటుకోవాలి. నటుడిగా నా నిలదొక్కుకొవాలనే బలీయమైన ఆలోచన ఇప్పుడు బలమైన వ్యవస్థగా మార్చింది. అల్లు కుటుంబ సభ్యులు జీవితాంతం ఆయనను గుర్తుపెట్టుకొవాలి. అల్లు రామలింగయ్య గారు ఆర్టిస్టుగా నిలదొక్కుకొన్నారు. ఆయన కుమారుడు అల్లు అరవింద్ను నిర్మాతగా చేయాలనే లక్ష్యంతో గీతా ఆర్ట్స్ను స్థాపించాడు. అల్లు అరవింద్కు ఓ దారి చూపించాడు అని చిరంజీవి చెప్పారు.

అల్లు అరవింద్ పెద్ద నిర్మాతగా
అల్లు అరవింద్ సమర్ధుడు కావడంతో తండ్రి కలను, విజన్కు అనుగుణంగానే నిర్మాతగా నిలదొక్కుకొన్నాడు. ఇండస్ట్రీలో పెద్ద ఫైనాన్షియర్గా మారారు. అంతేకాకుండా అల్లు అర్జున్ గానీ, బాబీ గానీ, శిరీష్ గానీ వీళ్లందరూ స్టార్ స్టేటస్ను సాధించారు. అందుకు ఆయనకు నివాళులర్పించుకోవాలి అని చిరంజీవి అన్నారు.

తండ్రి, తాతకు గ్రాటిట్యూడ్గా
అల్లు స్టూడియో స్థాపన వెనుక లాభాపేక్షతో చేసిన ప్రయత్నం కాదు. ఒక స్టేటస్ సింబల్గానే ఏర్పాటు చేశారు. వారి తండ్రి, తాతకు గ్రాటిట్యూడ్ చూపించేందుకు ఈ స్టూడియోను స్థాపించారు. ఈ తరమే కాకుండా వచ్చే తరం కూడా అల్లు పేరును ఒక బ్రాండ్గా చేయాలనే ప్రయత్నం జరిగింది అని చిరంజీవి అన్నారు.

అల్లు కుటుంబంలో భాగమైనందుకు..
తమ తండ్రి, తాతలు ఇచ్చిన జీవితాన్ని కేవలం థ్యాంక్స్ చెప్పుకోవడం కాకుండా.. ఆయన ఇచ్చిన స్థాయిని గుర్తు పెట్టుకొని.. తరతరాలు గుర్తుంచుకొనేలా, తలుచుకొనేలా ప్రయత్నం చేసిన అల్లు అరవింద్, అల్లు శిరీష్, అల్లు అర్జున్, బాబీని అభినందిస్తున్నాను. అల్లు కుటుంబంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. అల్లు శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమం సాయంత్రం ఉంది. అప్పుడు మరింత వివరంగా మాట్లాడుతాను అని చిరంజీవి చెప్పారు.

ముంబైలో గాడ్ ఫాదర్ ట్రైలర్ ఆవిష్కరణ
అల్లు స్టూడియోను ప్రారంభించిన చిరంజీవి.. తన స్వాగత ఉపన్యాసం అనంతరం గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ ఆవిష్కరణ కోసం ముంబై బయలుదేరి వెళ్లారు. ముంబైలో సల్మాన్ ఖాన్తో కలిసి ట్రైలర్ ఆవిష్కరించారు. ప్రముఖ హోటల్లో సాయంత్రం జరిగే అల్లు శతజయంతి వేడుకలో పాల్గొనేందుకు ముంబై నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తారు.


Click it and Unblock the Notifications











