Chiranjeevi: ఆ రోజే నా నట జీవితానికి పునాది రాళ్లు పడ్డాయి: చిరంజీవి ఎమోషనల్
సాధారణ జీవితం నుంచి అసాధారణ స్టార్డమ్ వరకు ఎదిగిన వ్యక్తి ఎవరు అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi). స్వయంకృషితో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ మెగాస్టార్ సినీ ప్రయాణం... కోట్లాది మందికి స్ఫూర్తి. తెలుగు సినిమా ఉన్నంతకాలం గర్వంగా వినిపించే పేర్లలో చిరంజీవి పేరు శాశ్వతం. స్వయంకృషితో ఎదిగి, అభిమానులకు 'అన్నయ్య'గా మారి, తన పేరును సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. అయితే... ఎంతటి స్టార్ అయినా, ఎంతటి స్థాయికి చేరుకున్నా, ప్రతి నటుడికి తన తొలి సినిమా, తొలిసారి కెమెరా ముందు నిలిచిన క్షణం జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకమే. అలాంటి మధురమైన, భావోద్వేగ క్షణాలను తాజాగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన నట జీవితంలో తొలి అడుగు వేసిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. 1979లో విడుదలైన పునాదిరాళ్లు (Punadhirallu) సినిమా కోసం, సరిగ్గా ఫిబ్రవరి 11న, చిరంజీవి తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. అదే రోజును గుర్తు చేసుకుంటూ, తన ఫస్ట్ మూవీ షూటింగ్ సమయంలో తీసిన అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ భావోద్వేగ పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్లో చిరంజీవి ఇలా రాసుకొచ్చారు.'ఈరోజు 'పునాదిరాళ్లు' సినిమా కోసం జీవితంలో తొలిసారి కెమెరా ముందు నిలిచిన రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆతృత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగినట్టే అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి.' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. అలాగే, తన నట జీవితానికి తొలి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి నమ్మకమే తన సినీ ప్రయాణానికి పునాది రాళ్లు వేసిందని పేర్కొన్నారు. ఈ రోజు వరకు తనను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
చిరంజీవి చేసిన ఈ భావోద్వేగ పోస్ట్, ఆయన షేర్ చేసిన ఫోటోలతో కలిసి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఈ పోస్ట్కు స్పందిస్తూ, చిరంజీవి ప్రయాణాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు. 'పునాదిరాళ్లు' చిరంజీవి నటించిన తొలి సినిమా అయినప్పటికీ, ప్రాణం ఖరీదు (Pranam Khareedu) ద్వారా ఆయన తొలిసారి వెండితెరపై దర్శనమిచ్చారు.
ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ, నటన, డ్యాన్స్, ఫైట్స్ ప్రతి విభాగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఏడుపది ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు దీటుగా స్క్రీన్పై అదరగొడుతుండటం ఆయన క్రమశిక్షణ, అంకితభావానికి నిదర్శనం. తాజాగా వచ్చిన 'మన శంకరవరప్రసాద్గారు'లోనూ అదే ఎనర్జీ కనిపించింది.
ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మన శంకర వర ప్రసాద్ గారు ఇప్పుడు ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో తెలుగు వెర్షన్ మాత్రమే విడుదలైన ఈ సినిమా.. ఓటీటీకి వచ్చేసరికి తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటించగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించారు. చిరు- నయన్ సీన్స్తో పాటు చిరు-వెంకటేష్ కాంబినేషన్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. థియేటరికల్ రన్ ప్రపంచ వ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇక ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తోందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











