విద్యారంగంలోకి మెగాస్టార్, చిరంజీవి ఇంటర్నేషన్ స్కూల్స్.. అభిమానుల పిల్లలకు రాయితీ!
మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ ఆసక్తికర వార్త మీడియాలో మారుమ్రోగిపోతోంది. ఇప్పటి వరకు సినిమా, సినిమా సంబంధిత రంగాల్లో కొనసాగుతూ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాంటి సామాజిక సేవా కార్యకమాలతో తన ప్రత్యేకత చాటుకున్న మెగాస్టార్ విద్యారంగంలోకి అడుగు పెట్టబోతున్నారట.
మోహన్ బాబు కుటుంబం తరహాలో మెగాస్టార్ ఫ్యామిలీ ఇకపై భావి భారత పౌరులను తీర్చిదిద్దే విద్యా సంస్థలను స్థాపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పాఠశాలను ప్రారంభించబోతున్నట్లు సమాచారం.
చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరిట ఈ విద్యా సంస్థలు ప్రారంభం కాబోతున్నాయని సీఈవో జె.శ్రీనివాసరావు పేరుతో జిల్లా న్యూస్ పేపర్లలో యాడ్స్ దర్శనమిచ్చాయి. శ్రీకాకుళం టౌన్ సమీపంలోని పెద్దపాడు రోడ్డులో మొదటి క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నారని, గౌరవ వ్యవస్థాపకుడిగా మెగాస్టార్ చిరంజీవి, గౌరవ అధ్యక్షుడిగా రామ్ చరణ్, గౌరవ చైర్మన్గా నాగబాబు ఉంటారని తెలుస్తోంది.

అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభం కాబోయే ఈ పాఠశాలలో ప్రపంచ స్థాయి వసతులు ఉంటాయని, ప్రస్తుతం నర్సరీ నుంచి గ్రేడ్ 5 వరకు తరగతులు ప్రారంభం అవుతాయని, ప్రతి సంవత్సరం తరగతులను పెంచుకుంటూ వెళతారని టాక్.
ఈ పాఠశాలలో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల పిల్లలకు, పేద విద్యార్థులకు ప్రత్యేక రాయితీ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ కుటుంబం నుంచి ఈ విద్యాసంస్థల విషయమై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన తాజా చిత్రం 'సైరా నరసింహారెడ్డి' షూటింగులో బిజీగా ఉన్నారు. దీనిపై స్పందించడానికి ఆయన అందుబాటులో రావడం లేదు. ఈ విషయమై నాగబాబు లేదా రామ్ చరణ్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











