మెగా 158 గ్రాండ్ లాంచ్.. చిరంజీవి కోసం ఇద్దరు సూపర్స్టార్స్!
మెగాస్టార్ చిరంజీవి మంచి దూకుడు మీదున్నారు. ఈ ఏడాది ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారుతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టారు చిరంజీవి. తాజాగా బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ ఓ సినిమా చేయనున్నారు. ఇది చిరంజీవి కెరీర్లో 158వ సినిమా. బాబీ- చిరంజీవి కాంబోలో వచ్చిన వాల్తేర్ వీరయ్య ఘన విజయం సాధించడంతో పాటు మన శంకర వరప్రసాద్ గారు తర్వాత మెగాస్టార్ నటిస్తోన్న మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మెగా 158లో చిరంజీవి సరసన సీనియర్ హీరోయిన్ ప్రియమణి నటించనున్నారని టాక్. వీరిద్దరి కలయికలో ఇదే తొలి సినిమా కావడం విశేషం. మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే చిరంజీవికి కూతురికి యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ నటించనున్నారని ఫిలింనగర్ వర్గాల సమాచారం. జన నాయగన్, టాక్సిక్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ మెగా 158ని నిర్మించనుంది. ఇప్పటికే మెగా 158 సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.

ఇటీవల ఈ సస్పెన్స్కు తెరదించారు మెగాస్టార్ చిరంజీవి. ఓ వీడియో విడుదల చేసిన ఆయన మెగా 158 కోసం తాను జిమ్లో ఎలా కష్టపడుతున్నది చూపించారు. 70 ఏళ్ల వయసులోనూ కఠినమైన వర్కవుట్స్ చేస్తూ చెమట చిందిస్తున్నారు. మే 21న పూజా కార్యక్రమాలతో మెగా 158 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిరంజీవి అధికారికంగా వెల్లడించారు. ముంబై మాఫియా బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట బాబీ. అలాగే ఈ సినిమా కోసం రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే కాకా అనే టైటిల్ మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
తాజాగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎస్ఎస్ థమన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు డైరెక్టర్ బాబీ.. మెగా 158 ప్రాజెక్ట్లోకి థమన్కు స్వాగతం పలికారు. బాక్స్లు బద్ధలయ్యే బీజీఎంకు తోడు మాస్ బీట్స్తో ఫుల్ ఫామ్లో ఉన్న థమన్.. చిరంజీవి కోసం అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చేందుకు సిద్ధం కానున్నారు. చిరు గ్రేస్, బాబీ టేకింగ్కు, థమన్ ఊర మాస్ సాంగ్స్ తోడైతే థియేటర్లో మెగా ఫ్యాన్స్కి పూనకాలు తప్పవని అంటున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలాఉండగా.. మే 21వ తేదీన మెగా 158 గ్రాండ్ లాంచ్ కార్యక్రమం నేపథ్యంలో ఈ ఈవెంట్కు చీఫ్ గెస్ట్లుగా ఎవరు రానున్నారు? అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే చిరంజీవి- బాబీ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ కోసం ఇద్దరు సూపర్స్టార్స్ చీఫ్ గెస్ట్లుగా రానున్నారని చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారింగా ప్రకటించింది. వారు ఎవరో కాదు.. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు మెగా పవర్స్టార్ రామ్ చరణ్లు చిరంజీవి కోసం తరలిరానున్నారు. చాలారోజుల తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్లు ఒకే వేదికపై కనిపిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
కాగా.. గత నెలలో పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేయడంతో రాజకీయాలు, పాలనా కార్యక్రమాలకు దూరంగా ఇంటి వద్దే విశ్రాంతి తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకుని ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇటీవలే కోలుకున్న డిప్యూటీ సీఎం తిరిగి తన రాజకీయ, పరిపాలనా బాధ్యతల్లో నిమగ్నమయ్యారు.


Click it and Unblock the Notifications


